కుల్ భూషణ్ జాదవ్‎ను పట్టించిన స్కాలర్ హత్య

కుల్ భూషణ్ జాదవ్‎ను పట్టించిన స్కాలర్ హత్య

ఇస్లామాబాద్: ఇరాన్‎లో ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్​భూషణ్ జాదవ్ కిడ్నాప్‎లో ఐఎస్ఐకి సహకరించిన ముస్లిం మతపెద్ద ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యాడు. బలూచిస్తాన్‎లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపేశారు. శుక్రవారం రాత్రి టర్బత్‎లోని లోకల్ మసీదులో ముఫ్తీ షా మీర్ ప్రార్థనలు ముగించుకుని మోటార్ సైకిల్‎పై ఇంటికి బయల్దేరాడు. అతన్ని వెంబడించిన కొందరు దుండగులు.. పాయింట్ బ్లాంక్ రేంజ్‎లో పలుమార్లు కాల్పులు జరిపారు. వెంటనే స్థానికులు అతన్ని హాస్పిటల్‎కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. 

ముఫ్తీ షా మీర్.. మత సంస్థ అయిన జమియత్ ఉలేమా–ఇ–ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడు. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడనే ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకు అత్యంత సన్నిహితుడు. పాక్‎లోని టెర్రరిస్ట్ క్యాంపులను పలుమార్లు సందర్శించాడు. ఇండియాలోకి టెర్రరిస్టులు చొరబడేందుకు సహకరించేవాడు. ముఫ్తీ షా మీర్ పని చేస్తున్న పార్టీకి సంబంధించిన ఇద్దరు పోయిన వారమే బలూచిస్తాన్‎లోని ఖుజ్దార్‎లో హత్యకు గురయ్యారు.