
వరంగల్సిటీ, వెలుగు: వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన 13 అభివృద్ధి పనుల కొనసాగింపుకు స్మార్ట్ సిటీ బోర్డు అనుమతి మంజూరు చేసింది. 26వ స్మార్ట్ సిటీ బోర్డు సమావేశాన్ని సోమవారం వర్చువల్గా నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం లో భాగంగా గత ఎజెండా లో ఆమోదం పొంది, కొనసాగుతున్న బయోమైనింగ్, స్మార్ట్ సిటీ ఫేజ్-1,2 పనులు, నాలాల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, దసరా , గవిచర్ల రోడ్లు, వడ్డేపల్లి బండ్, భద్రకాళి బండ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర 13 పనులను గడువును జూన్-2024 వరకు పొడిగిస్తూ బోర్డ్ ఆమోదించిందని తెలిపారు. స్మార్ట్ సిటీ జీ డబ్ల్యు ఎస్ సి సి ఎల్ ఎం డి పరిధిలో మంజూరు చేసిన 12 అదనపు అభివృద్ధి పనుల కొనసాగింపునకు స్మార్ట్ సిటీ బోర్డ్ ధృవీకరించిందని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమం లో కుడా సీపీ ఓ అజిత్ రెడ్డి,బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర,ఈ ఈ భీమ్ రావు, శ్రీనివాస్ రావు, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి పాల్గొన్నారు.