గడిచిన15 నెలల్లో జగదీశ్​రెడ్డిదే ఫస్ట్​ సస్పెన్షన్

గడిచిన15 నెలల్లో  జగదీశ్​రెడ్డిదే ఫస్ట్​ సస్పెన్షన్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​అధికారంలో ఉండగా అసెంబ్లీలో మొదటి సస్పెన్షన్ జరిగింది. 2023న డిసెంబర్​ 9వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగింది. ఆ తరువాత ఇప్పుడు జరుగుతున్న సెషన్స్​తో కలిపి ఐదుసార్లు అసెంబ్లీ సమావేశాలు  జరిగాయి. మొదటిసారి ఓటాన్​ అకౌంట్​బడ్జెట్​.. రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లోనే బీఆర్ఎస్​సభ్యులు.. సభను సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడే సమయంలో అడుగడుగునా అడ్డు తగలడమే కాకుండా.. స్పీకర్​ను డిక్టెట్​ చేసేలా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 

ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ రాగా..తాము అధికారంలో ఉండగా ప్రతిపక్షాలకు తగినంత అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. అంత ఈజీగా సస్పెన్షన్​లు, సభ్యత్వ రద్దులు చేసేలా ప్రతిపాదనలు ఉండవని తెలిపారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోని తొలిరోజే గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా బీఆర్ఎస్​ సభ్యులు నినాదాలు,  రన్నింగ్​కామెంట్రీ చేశారు. గురువారం ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా అసెంబ్లీ  స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ విషయంలో ఏకవచనంతో మాట్లాడటమే కాకుండా.. చైర్​ను ప్రశ్నించడం, అవమానించేలా మాట్లాడారు. దాంతో జగదీశ్​ రెడ్డిని ఈ సెషన్​కు సస్పెండ్​చేస్తూ స్పీకర్​ నిర్ణయం తీసుకున్నారు.