
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ సెట్లో అడుగుపెట్టనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని క్రేజీ అప్డేట్స్ను అందించాడు సందీప్ రెడ్డి వంగా.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ తుది దశలో ఉందని, స్ర్కిప్ట్ వర్క్తో పాటు స్ర్కీన్ప్లే రాయడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేశాడు. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్తో జరుగుతోన్న మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా త్వరలోనే కంప్లీట్ కానుందని చెప్పాడు.
మరోవైపు నటీనటుల ఎంపిక విషయంలోనూ స్పీడ్ పెంచారట మేకర్స్. ఇందులోని కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ మమ్ముట్టిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషించనున్నాడని, అందులో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే రివీల్ చేశారు. ప్రభాస్ను ఎప్పుడూ చూడని కోణంలో ఇందులో చూపించబోతున్నట్టు డైరెక్టర్ సందీప్ రెడ్డి చెప్పడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.