15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు.. టూరిజం పాలసీ టార్గెట్ ఇది

15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలు.. టూరిజం పాలసీ టార్గెట్ ఇది

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా గత డిసెంబర్ లో దీన్ని రూపొందించింది. కొన్ని మార్పులు, చేర్పులతో ఫైనల్​ చేసిన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. 2025 నుంచి 2030 వరకు ఐదేండ్ల పాటు అమలులో ఉండనున్నది. పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారిని ప్రోత్సహించడంతోపాటు అవసరమైతే భూములను లీజుకు ఇవ్వనున్నది.

ఇందులో భాగంగా ప్రత్యేక టూరిజం పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానున్నది. తెలంగాణ చరిత్ర, పర్యాటక ప్రాంతాల వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. వాటర్ పాల్స్, ప్రకృతి, పర్యావరణ,​ చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, ప్రముఖ ఆలయాలు, స్మారక చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. 

రవాణా సౌకర్యం, భోజన వసతి, పండుగలు, కళలు, తెలంగాణ సంస్కృతి వంటి సమస్త సమాచారం కూడా అందుబాటులో ఉంచేలా పోర్టల్ రూపొందిస్తున్నారు. అలాగే జాతీయంగా, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో తెలంగాణను టాప్ 5 రాష్ట్రాల్లో నిలపడం,  రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 10 శాతానికి పైగా పెంచడం లక్ష్యంగా పెట్టకున్నది.

తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేస్తం: జూపల్లి కృష్ణారావు 

రాష్ట్రంలో ఇప్పటివరకు టూరిస్టు పాలసీ లేదని, స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన యాక్షన్​ప్లాన్​తో అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చేలా పాలసీ రెడీ చేసినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ధి చేయడం, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో ఇలాంటి ఆచరణాత్మక విధానం రూపకల్పనలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా క్రియాశీలక భూమికను పోషించడం సంతోషంగా ఉందన్నారు.