
ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం (అక్టోబర్ 7న) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
ములుగు డివిజన్లో గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నది. ఇదిలా ఉండగా.. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నది.
ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్గా చేయడంపై సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు.