పుతిన్, జెలెన్​స్కీ కలిస్తేనే యుద్ధం ముగుస్తది.. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ఆపేందుకు పుతిన్​తో చర్చలు: ట్రంప్​

పుతిన్, జెలెన్​స్కీ కలిస్తేనే యుద్ధం ముగుస్తది.. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం ఆపేందుకు పుతిన్​తో చర్చలు: ట్రంప్​

జెలెన్​స్కీ ఓ నియంత.. యుద్ధానికి ఆయనే కారణం 
     శాంతి చర్చలకు ఆయన హాజరవ్వాల్సిన అవసరం లేదు 
     ఉక్రెయిన్​కు సాయం చేసినందుకు ఖనిజాలు తవ్వుకుంటామని వెల్లడి 

వాషింగ్టన్ :  రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ముగియాలంటే ఆ దేశ అధ్యక్షులు పుతిన్​– జెలెన్​స్కీ కలవాల్సిన అవసరం ఉన్నదని అమెరికన్​ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అభిప్రాయపడ్డారు. మూడేండ్ల నుంచి జరుగుతున్న యుద్ధం, లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి వారు తప్పక కలిసి తీరాలని అన్నారు. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మంచి చర్చలు జరిగాయని చెప్పారు. ఈ శాంతి చర్చలకు జెలెన్​స్కీ హాజరుకావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఫాక్స్​ న్యూస్​తో ట్రంప్​ మాట్లాడుతూ.. జెలెన్​స్కీ ఓ నియంత అని మండిపడ్డారు. మూడేండ్లుగా చర్చలు ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-–రష్యాల మధ్య చర్చలు  మొదలు కాగా.. తొలి సమావేశానికి ఉక్రెయిన్‌‌‌‌ కు ఆహ్వానం అందలేదు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ ఇటీవల మాట్లాడుతూ.. తమ భాగస్వామ్యం లేకుండా జరిగే ఈ చర్చల ద్వారా ఎలాంటి నిర్ణయం వెలువడినా దానిని అంగీకరించబోమని అన్నారు. ఈ నేపథ్యంలో జెలెన్​స్కీపై ట్రంప్​చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.   

యుద్ధానికి కారణం ఉక్రెయినే

యుద్ధానికి ఉక్రెయినే కారణమని, ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని ట్రంప్​ అన్నారు. మూడేండ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్‌‌‌‌ వాదనను తప్పుబట్టారు. కొంతమేర భూమితో పోయేదానికి యుద్ధందాకా తీసుకొచ్చాడని జెలెన్​స్కీపై మండిపడ్డారు.  ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు.  తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్‌‌‌‌ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.  జో బైడెన్​ ఆధ్వర్యంలో అందించిన పది బిలియన్ల డాలర్ల సహాయానికి పరిహారంగా ఉక్రెయిన్​లోని ఖనిజ నిక్షేపాలను తాము తవ్వుకుంటామని చెప్పారు. కాగా, రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ముగింపునకు తాను ఏమీ చేయలేదని అన్న  ఫ్రాన్స్​​ ప్రెసిడెంట్​ మాక్రన్​, బ్రిటన్​ ప్రధాని కీర్​ స్టార్మర్​పై ట్రంప్​ విమర్శలు గుప్పించారు. తాను ఏమీ చేయలేదు కాబట్టే వచ్చే వారం వైట్​హౌస్​లో చర్చలకు వారు వస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు.  

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్​ చైర్మన్ కు ఉద్వాసన

దేశంలోనే అత్యున్నత స్థాయి సైనిక అధికారిపై ట్రంప్​ వేటు వేశారు. అమెరికా జాయింట్​ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​ చైర్మన్ అయిన ఎయిర్​ఫోర్స్​ జనరల్​ సీక్యూ బ్రౌన్​ జూనియర్​కు ఉద్వాసన పలికారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మిలిటరీ అధికారులను తొలగించారు. “దేశానికి 40 ఏండ్లు సేవలందించిన సీక్యూ బ్రౌన్​కు ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయనకు, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా” అని ట్రంప్​ సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ట్రూత్​లో పోస్ట్​ చేశారు. జాయింట్​ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​ చైర్మన్​గా పనిచేసిన రెండో నల్లజాతీయుడు సీక్యూ బ్రౌన్​. ఆయనను ట్రంప్​ పదవి నుంచి తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

మిత్రుడు మోదీ, భారత్ కు నిధులిచ్చాం..

భారత్, బంగ్లాదేశ్​కు వేర్వేరుగా యూఎస్​ ఎయిడ్​ నిధులిచ్చామని డొనాల్డ్​ ట్రంప్​ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో భారత ప్రధాని మోదీ పేరును మొదటిసారి ఆయన ప్రస్తావించారు. ‘‘ఓటింగ్​ పెంచేందుకు నా మిత్రుడు మోదీ, భారత్​కు 21 మిలియన్​డాలర్లు వెళ్తున్నాయి. భారత్​కు మనం పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నాం. మరి మనకేంటి?  మన దగ్గర ఓటింగ్‌‌‌‌ శాతం పెరగడం మనకు కావాలి కదా?” అని అన్నారు. బంగ్లాదేశ్​లో రాజకీయ వ్యవస్థ బలోపేతానికి 29 మిలియన్​డాలర్లు అందజేసినట్టు చెప్పారు. అయితే, ఈ నిధులు ఇద్దరు వ్యక్తులు మాత్రమే పనిచేసే అనామక సంస్థకు వెళ్లాయన్నారు.