
- చంపే అధికారం అమిత్షాకు ఎవరు ఇచ్చారు ?
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కరీంనగర్/గోదావరిఖని, వెలుగు : మావోయిస్టులను చంపమని రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచారా ? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా డెడ్లైన్లు పెడుతున్నారని, ఆ అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారని నిలదీశారు. దేశంలో ప్రశ్నించే వారిని చంపడమే బీజేపీ ఎజెండానా అని మండిపడ్డారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
భారతదేశంలో నీళ్లు, పాల మాదిరిగా కలిసి ఉన్న విభిన్న కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మతం ముసుగులో రెచ్చగొడుతూ పౌరుల హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఇచ్చే ఆదాయంలో 2.4 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నారని, అదే ఉత్తరప్రదేశ్కు 17 శాతం, బీహార్కు 10శాతం ఇస్తున్నారని, బీజేపీ దుర్మార్గ పాలనకు ఇది పరాకాష్ట అని అన్నారు.
గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులకుప్పగా మార్చిందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య పాల్గొన్నారు. అనంతరం గోదావరిఖని ఎన్టీపీసీలో జరిగిన యువ కార్మికుల సదస్సులో మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. సదస్సులో యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్కుమార్, లీడర్లు ఎల్.ప్రకాశ్, వీరభద్రం, రంగయ్య, మడ్డి ఎల్లయ్య, ఏవీ.రావు పాల్గొన్నారు.