జేఎన్​టీయూ కాలేజీలో సౌలతులు కరువు

 జేఎన్​టీయూ  కాలేజీలో సౌలతులు కరువు

 

  • ప్రైవేట్​ బిల్డింగుల్లో క్లాసులు, హాస్టళ్లు
  •  ల్యాబ్​కు వెళ్లాలంటే కిలోమీటర్​ నడవాల్సిందే

వనపర్తి, వెలుగు : వనపర్తిలోని జేఎన్​టీయూ ఇంజనీరింగ్​ కాలేజీలో ఎలాంటి సౌలతులు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. ప్రతిష్ట గల విద్యాసంస్థ అయినందున ఇక్కడ అడ్మిషన్లు క్రమంగా పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వసతులు లేక పోవడం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. మూడేండ్ల కింద పీజీ సెంటర్​లో ప్రారంభించిన ఈ కాలేజీలో సీఎస్​సీ, సీఎస్​ఎం, సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచ్​లున్నాయి. 2022లో 118 మంది స్టూడెంట్స్​తో కాలేజీ మొదలుకాగా.. ప్రస్తుతం ఇక్కడ 723 మంది స్టూడెంట్స్​ చదువుకుంటున్నారు. 31 మంది గెస్ట్​ ఫ్యాకల్టీ ఉండగా, ముగ్గురు మాత్రమే రెగ్యులర్​ స్టాఫ్​ ఉన్నారు. 

సొంత బిల్డింగ్​ లేదు 

మూడేండ్ల కింద ఏర్పాటయినా ఇంతవరకు కాలేజీకి సొంత బిల్డింగ్​ లేదు. పీజీ సెంటర్​లో ఫ్టస్​ఇయర్​ క్లాసులు నడుస్తుండగా ఇటీవల సెకండ్, థర్డ్​ ఇయర్​ స్టూడెంట్లను కిలోమీటర్​ దూరంలో ఉన్న మరో బిల్డింగ్​కు మార్చారు. పీసీ సెంటర్​లోనే కంప్యూటర్​ ల్యాబ్​ ఉండడంతో ప్రాక్టికల్స్​ కోసం సెకండ్​, థర్డ్​ ఇయర్​ స్టూడెంట్స్​ కిలోమీటర్​ దూరం నుంచి నడిచి ఇక్కడి వస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో అంత దూరం నుంచి కాలినడకన ప్రధాన బిల్డింగుకు రావడానికి స్టూడెంట్స్​ ముఖ్యంగా అమ్మాయిలు కష్టపడాల్సివస్తోంది. 

ల్యాబ్​లో కంప్యూటర్ల కూడా సరిగా పనిచేయడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్​టీయూ ఇంజినీరింగ్​ కాలేజీ కోసం 2022లో నాగవరం వద్ద 45 ఎకరాలు కేటాయించారు. 2023లో రూ.4.17 కోట్లతో నిర్మాణపనులను ఒక ఏజెన్సీకి అప్పగించారు. 2 బ్లాకుల్లో బిల్డింగులు, ఒక హాల్​, 2 బోర్లు, కాంపౌండు వాల్​, వర్క్​షాప్​ నిర్మించాల్సిఉండగా ఏడాది అయినా పనులు ముందుకు కదలలేదు. సెకండ్​, థర్డ్​ఇయర్​ క్లాసుల కోసం తీసుకున్న ప్రైవేట్​ బిల్డింగ్​కు నెలకు రూ 60 వేలు అద్దె చెల్లిస్తున్నారు. 

ప్రైవేటు బిల్డింగులో గర్ల్స్​ ​ హాస్టల్​

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బిల్డింగులో గర్ల్స్​ హాస్టల్​నిర్వహిస్తున్నారు. గతంలో ప్రైవేటు ఆసుపత్రి ఉన్న బిల్డింగులో హాస్టల్​ఏర్పాటు చేయడంతో అంత సౌకర్యంగా లేదని అంటున్నారు. హాస్ట్​లో 124 మంది గర్ల్స్​ ఉండగా ఒక్కో గదిలో అయిదుగురు సర్దుకోవాల్సివస్తోంది. కొన్ని గదులకు మాత్రమే అటాడ్డ్​ బాత్​రూమ్​లు ఉన్నాయి.

దీంతో ఇతర గదుల్లో ఉన్న అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన నీటి సౌకర్యం కూడా లేదు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తా, బస్టాండు సమీపంలో బాయ్స్​కే రెండు హాస్టళ్లు కేటాయిం చారు. ఎక్కడో వండి టిఫిన్​, భోజనం హాస్టల్​కు తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. దీంతో క్వాలిటీ ఉండడంలేదని స్టూడెంట్స్​ చెప్తున్నారు. 

సమస్యలు తీరుస్తున్నాం

హాస్టళ్లలో, కాలేజీలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. టాయిలెట్స్​ను శుభ్రం చేయించాం. కాలేజీ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించాలని మున్సిపల్​ కమిషనర్​కు లేఖ రాశాం. సోమవారం లోగా మెస్​సమస్యలు తీర్చాలని మెస్​కాంట్రాక్టరు పిలిపించి చెప్పాం. ​ రామ్​నరేష్​ యాదవ్, వైస్​ ప్రిన్సిపాల్​