![తెలంగాణ విద్యుత్ బకాయిలపై.. కేంద్ర మంత్రితో జగన్ భేటీ](https://static.v6velugu.com/uploads/2022/08/There-are-no-mistakes-in-the-information-of-power-exchange-dues-says-Central-Power-Department-Minister-RK-Singh_oFZihymbc5.jpg)
- కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు.తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపైనే ఇరువురి మధ్య దాదాపు అరగంట పాటు చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించామన్నారు. తనతో భేటీ సందర్భంగా ఏపీ సీఎం జగన్ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
ప్రస్తుతం విద్యుత్ బకాయిల అంశం సొలిసిటర్ జనరల్ పరిధిలో ఉంది కాబట్టి.. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని జగన్ కు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పవర్ ఎక్స్చేంజీలలో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో ఎలాంటి పొరపాట్లు లేవని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 75 రోజులలోగా చెల్లించాలని సూచించారు. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారని తెలిపారు. చట్టం ప్రకారం ప్రాథమికంగా ఎవరు బకాయిలు చెల్లించాలనే దానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటామన్నారు.