- కువైట్ పోతుంటే ప్రమాదం జరిగిందంటున్రు
- తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలి
ములుగు, వెలుగు : బీటెక్ చదివిన నా కొడుకు ఉద్యోగరీత్యా రాజస్థాన్లోని ఓ కన్సల్టెన్సీ నుంచి ఇరాన్ వెళ్లిండు. అక్కడి నుంచి కువైట్ కు సముద్రమార్గంలో వెళ్తుంటే షిప్గల్లంతయిందని ప్రచారం జరుగుతోంది. దయచేసి నా కొడుకు ఆచూకీ కనిపెట్టండి’ అంటూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్క గ్రామానికి చెందిన గుర్రం రమ,- సమ్మిరెడ్డి దంపతులు వేడుకుంటున్నారు.
మంగళవారం ములుగులో వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. బయ్యక్కపేటకు చెందిన సర్పంచ్ గుర్రం సమ్మిరెడ్డి, రమ దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు శ్రీమాన్ బీటెక్ పూర్తి చేసిరాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న రుద్రాక్ష కన్సల్టెన్సీ ద్వారా జాబ్ కోసం అప్లై చేసుకున్నాడు. జాబ్ కన్ఫర్మ్ కావడంతో నవంబర్ 22న జైపూర్ నుంచి ఇరాన్ వెళ్లి ఉద్యోగంలో జాయినయ్యాడు.
రెండు రోజుల క్రితం డ్యూటీలో భాగంగా ఇరాన్ నుంచి కువైట్కు మరికొంతమందితో కలిసి షిప్లో బయలుదేరాడు. రోజు తమతో ఫోన్లో మాట్లాడే కొడుకు కాల్ చేయకపోవడంతో గాబరా పడిన సమ్మిరెడ్డి కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేశాడు. శ్రీమాన్ తోటి ఉద్యోగులతో కలిసి ఇరాన్ నుంచి కువైట్ వెళుతుండగా ఓడ ప్రమాదం జరిగిందని చెప్పారు. శ్రీమాన్ తో పనిచేస్తున్న శ్రీకాకుళానికి చెందిన యువకుడి డెడ్బాడీ దొరికిందని చెబుతున్నారని సమ్మిరెడ్డి కంటతడి పెట్టుకున్నాడు. తన కొడుకు ఆచూకీ మాత్రం చెప్పడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్పందించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.