
- సెపియన్స్ ల్యాబ్స్ స్టడీలో వెల్లడి
- 13–17 ఏండ్ల మధ్య వయస్సు వారిలోనే అధికం
- వాస్తవానికి దూరంగా బతుకుతున్న పిల్లలు
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ఫోన్ వినియోగం పిల్లల్లో విపరీత ప్రవర్తనకు కారణమవుతున్నది. వారిలో ఉన్నట్టుండి కోపాన్ని పెంచుతున్నది. బాధ, హెల్యూసినేషన్ (లేనివి ఉన్నట్టు కనిపించడం)కు కారణమవుతున్నది. కొన్నికొన్నిసార్లు పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది. సెపియన్ ల్యాబ్స్ అనే సంస్థ మన దేశంలోని స్మార్ట్ఫోన్ వాడుతున్న పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
‘ద యంగ్మైండ్: రైజింగ్అగ్రెషన్, యాంగర్’ పేరిట 10 వేల మంది పిల్లలపై చేసిన ఆ స్టడీ రిపోర్ట్ను ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం 13 నుంచి 17 ఏండ్ల వయసున్న టీనేజ్ పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం బాధ, కోపం, గిల్ట్, భయం, విపరీత పోకడలకు కారణమవుతున్నదని తేలింది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడయింది. స్టడీలో పాల్గొన్న అమ్మాయిల్లో 50 శాతం మంది సూసైడల్ టెండెన్సీలో ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొన్నది.
చిన్న వయసు నుంచే..
మన దేశంలో సగటున 11 ఏండ్ల వయసు నుంచే స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్నదని రిపోర్ట్ తేల్చింది. ఏజ్ పెరిగే కొద్దీ విపరీత ఆలోచనలు తగ్గుతున్నాయని, తక్కువ వయసున్న పిల్లల్లోనే ఇలాంటి విపరీత పోకడలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొన్నది. స్టడీలో పాల్గొన్న మొత్తం పిల్లల్లో సగం మందికిపైగా బాధ, కోపం, యాంగ్జైటీని రిపోర్ట్ చేసినట్టు తెలిపింది. 46 శాతం మంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని, 37 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలున్నాయని వెల్లడించింది. ఫోన్ వాడుతున్న వాళ్లలో చాలా వరకు నేర్చుకునేతత్వాన్నీ కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
స్మార్ట్ఫోన్లతో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు (శాతాల్లో)
సమస్య అబ్బాయిలు అమ్మాయిలు
విపరీత పోకడలు, కోపం 50 60
బాధ, నిస్సహాయత, డిప్రెషన్ 50 70
తప్పు చేశామన్న భావన 50 65
వ్యసనం 47 –––
భయం, యాంగ్జైటీ 45 60
ఆత్మహత్య ఆలోచనలు 37 50
మూడ్ స్వింగ్స్ 38 57
ఏకాగ్రత లోపించడం 38 50