- అధికారులను అడిగి తెలుసుకున్న సీడబ్ల్యూపీఆర్ఎస్ ఎక్స్పర్ట్స్ టీమ్
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్పూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ముగ్గురు సభ్యులతో కూడిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ టీమ్లో జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్, సైంటిస్ట్ జె.ఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్, సైంటిస్ట్ సి. డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టీవ్ పరీక్ష నిపుణుడు డాక్టర్ ప్రకాష్ పాలే ఉన్నారు. పూణె నుంచి వచ్చిన వీళ్లు ముందుగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబట్పల్లి వద్ద మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుకున్నారు.
ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు రిసీవ్ చేసుకొని బ్యారేజీపైకి తీసుకెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన వంతెనపై కాలినడకన సాగుతూ పరిశీలించారు. అప్ స్ట్రీమ్లో కిందికి దిగి ఏడవ బ్లాక్ లో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించి కుంగుబాటుకు గల కారణాలను ఇంజనీరింగ్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లలో తిరుగుతూ పరిశీలించారు.
బ్యారేజీ 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లు, పిల్లర్లపై ఏర్పడిన పగుళ్లను.. ఎగువ, దిగువ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఫొటోలు తీసుకున్నారు. 15 నుంచి 21వ పిల్లర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్ల రిపేరు పనులను పరిశీలించారు. బ్యారేజీ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో? దెబ్బతిన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో ఈ టీమ్కు ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్రెడ్డి వివరించారు. ఎక్స్పర్ట్స్ టీమ్ సుమారు గంటపాటు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది.
అన్నారం బ్యారేజీ పరిశీలన
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన అనంతరం సెంట్ర ల్ టీం అన్నారం (సరస్వతీ) బ్యారేజీకి చేరుకొని బ్యారేజీలో ఏర్పడిన బుంగల(సీపేజీ)ను పరిశీలించింది. బ్యారేజీ మొత్తం 66 పిల్లర్లను పరిశీలించి ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి? వాటి రిపేర్లకు ఇంతకుముందు ఏం చర్యలు చేపట్టారు? వంటి వివరాలను అక్కడి ఈఈ యాదగిరిని అడిగి తెలుసుకుంది.
2020, 2021 సంవత్సరాల్లో కూడా బ్యారేజీ పిల్ల ర్ల కింద లీకేజీలు ఏర్పడగా వరంగల్ ఎన్ఐటీకి చెందిన ఎక్స్పర్ట్లతో చర్చించి, వారి ఆమోదంతో రెండు సార్లు కెమికల్ గ్రౌటింగ్ చేయించినట్టుగా ఈఈ యాదగిరి ఆధారాలు చూపించారు. అప్ స్ట్రీమ్లో సీసీ బ్లాక్ చెక్కు చెదరలేదని అన్నారు. కానీ డౌన్ స్ట్రీమ్లో ఎందుకు కొట్టుకుపోయాయి? అని నిపుణులు ఆరా తీశారు.
డౌన్ స్ట్రీమ్లో 28, 38, 35, 44 పిల్లర్లను పరిశీలించారు. సీఎస్ ఐఆర్ఎంజీఆర్ఐ, సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఎస్ఆర్ సంస్థలు బ్యారేజీకి టెస్ట్ చేస్తాయని ఈఈ తెలిపారు. ఈ సంస్థలు చేసే టెస్టు రిపోర్టులను బట్టి పర్మినెంట్ రిపేర్లు చేయనున్నట్లుగా వివరించారు. నిపుణుల టీమ్ బ్యారేజీ లలో తిరిగి ఏమేమి టెస్ట్ లు చేయాలో తెలుసుకున్నది. అనంతరం నిపుణుల బృందం పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీని పరిశీంచింది.