రాజ్యసభలోనూ నీట్ పై రచ్చ

రాజ్యసభలోనూ నీట్ పై రచ్చ

న్యూఢిల్లీ: నీట్​ ఎగ్జామ్​పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. చైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్​​ దృష్టిని ఆకర్షించేందుకు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇతర సభ్యులతో కలిసి వెల్​లోకి దూసుకెళ్లడంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకొన్నది. దన్​ఖడ్​, ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత పార్లమెంట్​ చరిత్రలోనే ఇది కళంకిత దినమని, అపోజిషన్​ లీడర్​ ఇంతకు ముందెన్నడూ వెల్​లోకి దూసుకురాలేదని  దన్​ఖడ్​​ అన్నారు. ‘‘ఈ ఘటనతో నేను షాక్​ అయ్యా.. బాధపడ్డా..  ప్రతిపక్షనేత, ఉపనేత వెల్​లోకి దూసుకొచ్చేటంత దాకా భారత పార్లమెంటరీ సంప్రదాయం  దిగజారిపోయింది”అని వ్యాఖ్యానించారు.

చైర్మన్​ పట్టించుకోకపోవడం వల్లే..: ఖర్గే

తాను10 నిమిషాల పాటు చేతులు పైకెత్తినప్పటికీ చైర్మన్​ పట్టించుకోకపోవడంతోనే అలా చేశానని ఖర్గే సమాధానమిచ్చారు. చైర్మన్​తనను పట్టించుకోకుండా అవమానించారని, తనకు మరో దారిలేక అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. ‘‘నాకున్న మరో ఆప్షన్​ సీటులోంచి గట్టిగా అరవడం మాత్రమే. అయినా చైర్మన్​ పట్టించుకోరనే ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వెల్​లోకి దూసుకెళ్లా. ఇది చైర్మన్ ​తప్పే. నీట్​ పరీక్షలో ఇంతపెద్ద స్కామ్​ జరిగింది.  పేపర్ ​లీక్​ అయి లక్షలాది మంది స్టూడెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. మేందీనిపై చర్చ జరగాలని డిమాండ్​ చేస్తున్నాం. విద్యార్థుల సమస్యలను లేవనెత్తుతున్నాం” అని ఖర్గే పేర్కొన్నారు.