
నర్సంపేట, వెలుగు : చోరీలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఖానాపురానికి చెందిన మడిపెద్ది వినయ్, గొటుకల నవీన్, నర్సంపేటకు చెందిన బాదం సాయికుమార్ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం చోరీలుకు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న ఖానాపురంలోని కుసుమ రాజమ్మ ఇంట్లో రూ. 1.10 లక్షలు ఎత్తుకెళ్లారు. 17న నర్సంపేట పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన మొలుగూరి నాగేందర్ ఇంట్లో రూ. 3 లక్షలు, ఇమ్మడి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ. 90 వేల విలువైన వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం నర్సంపేటకు వచ్చి ఆభరణాలు అమ్మేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి డీసీపీ నగదు బహుమతులు అందజేశారు. నర్సంపేట ఏసీపీ పుప్పాల తిరుమల్, సీఐలు రవికుమార్, కిషన్, ఎస్సైలు శీలం రవి, చరణ్, మధు గౌడ్ పాల్గొన్నారు.