
- గ్యాస్ కట్టర్తో మిషిన్ కత్తిరించి దొంగతనం
- అలారాం మోగకుండా సెన్సార్ వైర్లు కట్
- రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీ శివారులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. ఎస్బీఐ ఏటీఎంను ఆరు నిమిషాల్లో ధ్వంసం చేసి రూ.29.70 లక్షలు కొల్లగొట్టింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో ఈ ఘటన జరిగింది. రావిర్యాలలోని ఎస్బీఐ బ్రాంచ్ పక్కనే ఏటీఎం ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక 1.54 గంటలకు ఓ కారులో నలుగురు ముసుగు వేసుకున్న దుండగులు ఆ ఏంటీఎం సెంటర్ కు వచ్చారు.
ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై బ్లాక్ స్ప్రే కొట్టారు. అలారాం మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేశారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషిన్ కత్తిరించి రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం అందులోంచి రూ.29.70 లక్షలు చోరీ చేసి పారిపోయారు. అదే సమయంలో ఏటీఎంలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ నుంచి బ్యాంకు మేనేజర్ కొర్ర శ్రీవాణికి ఫోన్ రావడంతో ఆమె వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే చోరీ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు హైవేలు, ఓఆర్ఆర్ టోల్ ప్లాజా నిర్వాహకులను అలర్ట్ చేశారు. చోరీ జరిగిన ప్రదేశానికి మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు చేరుకొని పరీశీలించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, బ్యాంకు మేనేజర్ శ్రీవాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దొంగల కోసం గాలిస్తున్నారు.