
ఘట్కేసర్, వెలుగు: తాళం వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అవుశాపూర్లోని జగత్ స్వప్న వెంచర్లో రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల కిందట కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లాడు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని తులంన్నర బంగారం, రూ.10 వేల నగదు కన్పించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి, స్థానిక సీఐ పరుశురామ్ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న అంజలి, థామస్, రవి, అనంతన్, శైలు ఇండ్లలోనూ చోరీ జరిగినట్లు గుర్తించారు. వీరి ఇండ్లలో ఏమీ లభించకపోవడంతో దొంగలు వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లారు. సీసీ పుటేజీలను పరిశీలించగా, ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్క్లు ధరించి, దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ను రప్పించి, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.