సిర్పూర్ యు .. వైన్ షాప్​లో రూ.5 లక్షల మద్యం చోరీ

సిర్పూర్ యు .. వైన్ షాప్​లో రూ.5 లక్షల మద్యం చోరీ
  • మరో రెండు చోట్ల చోరీలు

జైనూర్, వెలుగు: మూసివేసి ఉన్న వైన్​షాప్​తాళం పగులగొట్టిన దుండగులు రూ.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కుమ్రం భీం జిల్లా జైనూర్ సరిహద్దులో ఉన్న సిర్పూర్ యులో జరిగింది. శ్రీసాయి వైన్ షాప్​లో ఆదివారం సాయంత్రం వరకు అమ్మకాలు చేపట్టిన నిర్వాహకులు ఆ తర్వాత షటర్​కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న దుండగులు వైన్​ షాప్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పైకి తిప్పేసి, షటర్ ​తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు.

దాదాపు రూ.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, కౌంటర్​లో ఉన్న రూ.15 నగదుతో ఉడాయించారు. ఉదయం షటర్ ​తీసి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు నిర్వాహకులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని డాగ్ స్క్వాడ్​తో తనిఖీ చేపట్టారు. షాప్ యాజమాని రాథోడ్ వసంత్ రావు ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైనూర్ సీఐ అంజయ్య తెలిపారు.

పట్టపగలు ఇంట్లో చోరీ

లోకేశ్వరం, వెలుగు: లోకేశ్వరం మండలం లోని గడ్ చందాకు చెందిన అంబకంటి లావణ్య ఇంట్లో సోమవారం పట్టపగలు చోరీ జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో లావణ్య తన కూతుర్ని చూడడానికి ముథోల్ వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 35 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు దోచుకెళ్లారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దిగంబర్ తెలిపారు.

ఖానాపూర్​లో..

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణం పద్మావతి నగర్ కాలనీలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఎస్​ఐ లింబాద్రి వివరాల ప్రకారం.. కాలనీలోని ఓ ఇంటి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 5 గ్రాముల బంగారం చెవి కమ్మలు చోరీ చేశాడు. అదే కాలనీలోని మరో రెండు ఇండ్లలోనూ చోరీకి ప్రయత్నించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిర్మల్​కు చెందిన క్లూస్ టీం చేరుకొని ఫింగర్ ప్రింట్స్ సేకరించాయి.