
తిరుమల శ్రీవారి ఆలయం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారి కానుకలను భక్తులు దక్కించుకునే అవకాశాన్ని కల్పించింది. హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను ఈ-వేలం వేయనున్నట్లు ప్రకటించింది. స్వామివారి కానుకలు కావాలనుకునేవారు వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 21) ప్రకటన విడుదల చేశారు టీటీడీ అధికారులు. మే 1, 2వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఇ-వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, సిటిజన్, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్ తో పాటు ఇతర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి.ఈ-వేలంలో భాగంగా కొత్త వాచ్ లు, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఉంచారు అధికారులు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) నంబరుకు కార్యాలయ వేళల్లో ఫోన్ చేసి సంప్రదించగలరు. అదేవిధంగా టీటీడీ లేదా ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా వేలంలో పాల్గొనవచ్చు.
టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం నంబరు: 0877-2264429
టీటీడీ వెబ్ సైట్: www.tirumala.org
ప్రభుత్వ పోర్టల్: www.konugolu.ap.govt.in