తెలంగాణ జాబ్స్ స్పెషల్ : నిజాం కాలపు నిర్మాణాల నేపథ్యం

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : నిజాం కాలపు నిర్మాణాల నేపథ్యం

ఎంజే మార్కెట్: ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ చిన్న కుమారుడు ప్రిన్స్​ మొజంజా బహదూర్​ పేరు మీదుగా మొజంజాహీ మార్కెట్​ను 1935లో పూర్తి చేశారు. ఈ మార్కెట్​ పై భాగంలో ఉన్న గడియారం ప్రత్యేక ఆకర్షణ. మార్కెట్​ను గ్రానైట్​ స్టోన్​, బూడిద రంగు రాయితో నిర్మించారు. 

అసఫ్​జాహీల కాలంలో హైదరాబాద్​ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఆనాటి కాలంలో నిర్మించిన భవన సముదాయాలు నేటికీ వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​, ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కాలంలో చేపట్టిన నిర్మాణాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఇవి పోటీ పరీక్షల దృష్ట్యా ఎంతో కీలకం. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కాలంలో చేపట్టిన నిర్మాణాల గురించి తెలుసుకుందాం.   


రాష్ట్రపతి నిలయం: బ్రిటీష్​ వైశ్రాయ్​ నివాసాన్ని 1950లో కేంద్ర ప్రభుత్వం రూ.60లక్షలకు కొనుగోలు చేసి దాన్ని రాష్ట్రపతి నిలయంగా తీర్చిదిద్దింది. 70 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రపతి నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి దక్షిణ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ నివాసాన్ని ఏర్పాటు చేశారు.  

ఉస్మానియా హాస్పిటల్​: మూసీ నదీ తీరంలో 1866లో రెండు అంతస్తుల హాస్పిటల్​ భవనాన్ని నిర్మించి, అత్యంత ఆధునిక వైద్య సేవలను అందిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఈ హాస్పిటల్​ను అఫ్జల్​గంజ్​ దవాఖానా అని పిలిచేవారు. 1908లో మూసీ నది వరదల తాకిడికి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఏడో నిజాం ప్రభువు 1920లో తిరిగి అదే ప్రాంతంలో హాస్పిటల్​ కోసం నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఐదేండ్లలో పూర్తి చేసి 1925లో కొత్త హాస్పిటల్​ ప్రారంభించాడు.

ఈఎన్​టీ హాస్పిటల్​: ప్రస్తుత చెవి ముక్కు గొంతు హాస్పిటల్​ భవనాన్ని ప్రఖ్యాత పార్శీయులు  పెస్తోజీ అండ్​ కంపెనీ  నిర్మించింది. 1839–45 మధ్యకాలంలో పెస్తోజీ కంపెనీ నిజాం ప్రభువుల రెవెన్యూ రికార్డులు, లెక్కలు పరిశీలించేవారు. పెస్తాన్​జీ నిర్మించిన ప్రస్తుత ఈఎన్​టీ హాస్పిటల్​ భవన సముదాయాన్ని నిజాం రాజ్యంలోని ఉన్నతోద్యోగి రాజా ప్రతాపగిరి కొన్నారు. 

సిటీ కాలేజ్​: మూసీ నదీ తీరంలో ముస్లిమ్​జంగ్​ బ్రిడ్జికి సమీపం, హైకోర్టు భవనానికి పశ్చిమ వైపుగా సిటీ కాలేజ్​ని 1921లో ఏడో నిజాం ప్రభువు నిర్మించారు. హింద ముస్లిం వాస్తుకళ మిశ్రమంతో రూ.8లక్షలతో ఈ కాలేజ్​ నిర్మించారు. మొదటి, రెండో అంతస్తుల వారందరికీ ఉపయోగపడేలా అతిపెద్ద హాలును నిర్మించారు. దీన్ని గ్రేటర్​ హాల్​ అంటారు.  నిజాం ప్రభువు పిల్లల చదువు కోసమని సిటీ స్కూల్​గా ఏర్పడి, ఆ తర్వాత సిటీ కాలేజ్​గా అభివృద్ధి చెంది కాలానుగుణంగా ప్రస్తుత విద్యా విధానంలోని వివిధ కోర్సులను ప్రవేశపెట్టారు. 2004 మార్చి 7న ఈ కళాశాల స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించారు. 

చిరాన్​ ప్యాలెస్​: ఏడో నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ రాజ్​ ప్రముఖ్​ పదవి చేపట్టిన అనంతరం తాను నివాసం ఉండే కింగ్​ కోఠి ప్రాంతం జనసమర్థతతో ఉన్నదని తనకు నగర శివారులో ఎక్కడైనా తగిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరగా రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్​లోని రిజర్వ్​ ఫారెస్ట్​లో 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిలోనే ఏడో నిజాం తన కోసం చిరాన్​ ప్యాలెస్​ను ఆధునిక రీతిలో ఫ్రెంచ్​ వారి వాస్తుశైలిలో నిర్మించారు. నిజాం వారసులకు ఆరెకరాల భూమిని వదిలి మిగతా ప్రాంతంలో జాతీయ పార్క్​ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పార్కును కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా నామకరణం చేసింది. 

రెడ్డి హాస్టల్​: నిజాం పాలనా కాలంలో నగర పోలీస్​ కమిషనర్​గా రాజా బహదూర్​ వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్న సమయంలో విద్యార్థుల కోసం 1920లో ఒక వసతి గృహాన్ని రెడ్డి హాస్టల్​ పేరుతో ప్రారంభించారు. యురోపియన్​ ఇండో హిందువు శైలిలో నిర్మించిన ఈ హాస్టల్​ భవనంలో 150 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉంది. 

హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్: నిజాం ప్రభుత్వంలోని రెవెన్యూశాఖ  డైరెక్టర్​ శ్రీవాక్​ ఫీల్డ్​ చొరవతో జమీందారులు, ఆంగ్లేయుల పిల్లల కోసం ఒక పబ్లిక్​ స్కూల్​ను 1924 నవంబర్​లో ఏర్పాటు చేశారు. ఈ పబ్లిక్​ స్కూల్​కు జాగీర్దార్​ కాలేజ్​ అనే పేరు పెట్టారు. స్థానిక ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇండియన్​ పబ్లిక్​ స్కూల్​గా పేరు మార్చి తగిన మార్పులతో తిరిగి ప్రారంభించారు. ఈ అతిపెద్ద భవన సముదాయంలో ప్రస్తుతం హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ను నిర్వహిస్తున్నారు. 

జూబ్లీహాల్​: ఏడో నిజాం ప్రభువు మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ అధికారం చేపట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం కోసం 1936లో ప్రత్యేకంగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. 1936లో జూబ్లీ వేడుకలు జరగాల్సి ఉన్నా కింగ్​ ఐదో జార్జి మరణించడంతో ఆ వేడుకలను 1937లో నిర్వహించారు. సిల్వర్​ జూబ్లీ కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఏర్పాటు చేసిన భవనం కాబట్టి ఇది జూబ్లీ భవన్​గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలిని జూబ్లీహాల్​ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. 

నీలోఫర్​ హాస్పిటల్​: మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 2వ కొడలైన ప్రిన్సెస్​ నీలోఫర్​ పేరు మీదుగా 1949లో ఈ హాస్పిటల్​ను ప్రారంభించారు. ఈ హాస్పిటల్​ చిన్న పిల్లల వైద్యానికి ప్రసిద్ధి చెందింది. 

నిజాం సంస్థానం.. దివాన్​ దేవిడి

నిజాం సంస్థానం ప్రధాని అధికార నివాసమే దివాన్​ దేవిడి. అసఫ్​జాహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన సాలార్​జంగ్​–1, సాలార్​జంగ్​–2, సాలార్​జంగ్​–3 మొదలైన వారు దివాన్​ దేవిడి నుంచి తన అధికార హోదాలో ప్రభువులకు తమ సేవలు అందించారు. సాలార్​జంగ్​–1, సాలార్​జంగ్​–3 సేకరించిన అనేక విశిష్టమైన కళారీతులు మొదట దివాన్​ దేవిడిలోనే ప్రజాప్రదర్శనకు ఏర్పాటు చేశారు. సాలార్​జంగ్​ మ్యూజియం నిర్మాణం పూర్తయిన తర్వాత దివాన్​ దేవిడిలోని కళారీతులను మ్యూజియానికి తరలించారు. బర్మా టేకుతో చేసిన లక్కడ్​ కోట భవన సముదాయం, నిలువుటెత్తు అద్దాలు, షాండిలియర్లు గల ఐనా ఖానా హాలు మొదలైన వాటితో దివాన్​ దేవిడిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. 

కింగ్​కోఠి: కింగ్​కోఠి అంటే ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ నివాసించే ప్యాలెస్​. 21 ఎకరాల్లో ​ విస్తరించి ఉన్న ప్యాలెస్​ను యూరోపియన్​ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్​ను కమాల్​ఖాన్​ నిర్మించాడు. ఇందులోని అద్దాలు, తలుపులు, గోడలపై కమాల్​ఖాన్​ తన పేరును కేకే అని చెక్కించుకున్నాడు. కేకేను కింగ్​కోఠిగా నిజాం మార్చాడు. ముబారక్​ మాన్సన్, ఉస్మాన్​ మాన్సన్​, నియాజ్​ఖాన్​, మేజ్​ఖానా ఇలా పలు భవనాలు నిర్మించాడు. ముబారక్​ మాన్సన్​ ఎత్తయిన ప్రధాన సింహద్వారాల దగ్గర ఒక పెద్ద పరదా వేలాడుతూ ఉండేది.

నిజాం ప్రభువు ప్యాలెస్​లో లేని సమయంలో ఈ పరదాను ఎత్తి ఉంచేవారు. ముబారక్​ మాన్సన్​కు తూర్పు దిశలో బొగ్గులకుంట రోడ్డులోని ప్రవేశ ద్వారాన్ని గాధిలాల్​ గేటు అని అంటారు. ఇందులో నిజాం వ్యక్తిగత కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల సలహాదారుని కార్యాలయాలు ఉండేవి. ఈ మాన్సన్​లోనే సూపరింటెండెంట్​ ఆఫ్​ ది రాయల్​ ప్యాలెస్​ అధికార కార్యాలయం ఉండేది. దీన్నే సీట్​ ఆఫ్​ హజర్​ జంగ్​ అని పిలిచేవారు. కింగ్​ కోఠి ప్యాలెస్​ను తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ సందర్శించాడు. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ 1967 ఫిబ్రవరి 24న ఈ ప్యాలెస్​లోనే మరణించారు. ప్రస్తుతం ​ కోఠి ప్యాలెస్​ భవనంలో కింగ్​ కోఠి హాస్పిటల్​ నడుస్తోంది.