
జీహెచ్ఎంసీ కమిషనర్ కె. ఇలంబర్తి బదిలీ అయ్యారు. కొత్త కమీషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం. గత సంవత్సరంలోనే నలుగురు కమిషనర్లు మారడం గమనార్హం.
2024 జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం. ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు. ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని MAUD సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఇలంబర్తి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా 2012 బ్యాచ్ కి చెందిన కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం.
ఆరు నెలల్లో అడ్మినిస్ట్రేషన్ పై పట్టు తెచ్చుకున్నారు ఇలంబర్తి. అధికారులు, ఉద్యోగుల విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇలంబర్తి. గతంలో చేసిన పలు స్కామ్స్ ను బయటపెట్టారు ఇలంబర్తి . అయితే ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం, వారితో ఇంటరాక్ట్ కావడంలో ఇలంబర్తి వెనుకబడ్డారని ప్రచారం జరుగుతోంది. కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులకు టైమ్ ఇవ్వకపోవడం.. డివిజన్లలో సమస్యలు వినకపోవడంతో ఇలంబర్తి పై కంప్లెయింట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలంబర్తిని బదిలీ చేసింది.