
- ఒకవైపు రాబడుల ఆశలు.. ఇంకోవైపు ఆదాయ లోటు
- వచ్చే ఆర్థిక సవంత్సర బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ కసరత్తు
- అన్ని శాఖలతో ప్రీ బడ్జెట్ మీటింగ్స్ పూర్తి
- మార్చి మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు!
హైదరాబాద్, వెలుగు:ఒకవైపు భారీ రాబడుల ఆశలు.. ఇంకోవైపు ఆదాయ లోటుతో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తలమూనకలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్నంత మేర ఆదాయం రాకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి అంచనాలపై తర్జనభర్జన పడుతున్నది.
మొదటి ఏడాదిలోనే వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయం ఖజనాకు చేరకపోవడంతో ఈసారి బడ్జెట్ ఎంత ఉంటుంది? ఎక్కడెక్కడ కేటాయింపులు పెంచాలి? రాబడులకు ఉన్న అవకాశాలు ఏమిటనే దానిపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. మార్చి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టగా.. ఈసారి రూ.3 లక్షల కోట్ల పైనే అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది.
ఐదారోజుల్లో సవరించే అంచనాలపై స్పష్టత రానుంది. దీంతో దానికి అనుగునంగా బడ్జెట్కు రాష్ట్ర ఆర్థిక శాఖ తుదిరూపు ఇవ్వనుంది. అప్పులు, ఆదాయం అంతగా లేకుండా ఉన్న ఏపీ రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను పెట్టింది. దీంతో హైదరాబాద్ లాంటి భారీ ఆదాయం వచ్చే రాజధాని ఉండి.. భారీగా ఇన్కం జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్న తెలంగాణ బడ్జెట్ కచ్చితంగా రూ.3 లక్షల కోట్లు దాటుతుందని సెక్రటేరియేట్ వర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికే దాదాపు అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీబడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఏయే శాఖలో ఎలాంటి పథకాలు ఉన్నాయి ? నిధులు ఎంత అవసరం పడుతాయి? ఇతరత్రా వంటి వాటిపై క్లారిటీకి వచ్చారు. కేంద్రం బడ్జెట్లోనూ తెలంగాణకు అంతగా నిధులు ఇవ్వలేదు.
కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందా అనే ఆసక్తి నెలకొన్నది.
తప్పిన అంచనాలు.. కేంద్రం నుంచి అరకొరగానే నిధులు
రాష్ట్ర ఆదాయం అంచనాల మేరకు రాలేదు. కనీసం రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు తనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.74 లక్షల కోట్ల రాబడి అంచనా వేసింది. అయితే 10 నెలల్లో అంచనాలు వేసిన దాంట్లో 66.57 శాతం అంటే రూ.1.82 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలిన రెండు నెలల్లో ఇంకో 15 శాతం వచ్చినా దాదాపు 20 శాతం భారీ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
2024–25కు సంబంధించి దాదాపు రూ.13 వేల కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీముల నుంచి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు వచ్చింది రూ.6 వేల కోట్లు కూడా లేదని అధికారులు చెబుతున్నారు. కొన్నేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్ను వాటాలు, ఇవ్వాల్సిన గ్రాంట్ఇన్ ఎయిడ్లు ఆశించిన మేర రావడం లేదు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21,636 కోట్లకు గాను రూ.5,176 కోట్లు మాత్రమే వచ్చింది. నాన్ టాక్స్ రెవెన్యూ కూడా రూ.35 వేల కోట్లకు రూ.5,866 కోట్లు వచ్చింది. ఈ రెండింటిలోనే ప్రభుత్వ ఖజనాకు రూ.46 వేల కోట్ల మేర లోటు ఏర్పడుతున్నది. అందులో భాగంగానే నాన్ టాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేసింది.