సెల్​టవర్లే టార్గెట్ గా చోరీలు

సెల్​టవర్లే టార్గెట్ గా చోరీలు
  • ముగ్గురి అరెస్టు 
  •  రూ.1.50 లక్షలు, ఒక ఫోన్, కారు స్వాధీనం

హాలియా, వెలుగు: బీఎస్ఎన్ఎల్, ఎయిర్​టెల్​సెల్​ఫోన్​ టవర్లే టార్గెట్​గా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని నల్గొండ జిల్లా పెద్దవూర పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం పెద్దవూర పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునసాగర్​ సీఐ బీసన్న వివరాలు వెల్లడించారు.  తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ మహేశ్, నాగేశ్, వినోద్​  పెద్దవూర మండలంలోని రెండు టవర్లు, తిరుమగిరి సాగర్, నరసరావుపేట పరిధిలో రెండు టవర్లలో 5 జీ సిగ్నల్స్ కోసం బిగించిన రేడియో రిమోట్,  బేస్ బాండ్ యూనిట్లను ఎత్తుకెళ్లారు. వాటిని హైదరాబాద్ నాంపల్లి లో వారికి తెలిసిన వ్యక్తి మాలిక్​కు విక్రయించారు.  వచ్చిన డబ్బులను సమానంగా పంచుకున్నారు. 

వరుసగా దొంగతనాలు జరుగుతుండటం పోలీసులకు సవాల్​గా మారింది.  ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ  డీఎస్పీ  రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఆదివారం పోతునూర్ శివారు టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కారులో వెళ్తున్న మహేశ్, నాగేశ్, వినోద్​ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో చోరీలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు.  దీంతో, ఆ ముగ్గురి వద్ద నుంచి  రూ. 1.50 లక్షలు, రిమోట్​యూనిట్, ఒక ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న  డీఎస్పీ రాజశేఖర్ రాజు, నాగార్జున సాగర్ సర్కిల్ సీఐ బీసన్న, పెద్దవూర ఎస్ఐ వీరబాబు,హెడ్ కానిస్టేబుల్ ఇద్దయ్య, సిబ్బంది లోకేశ్ రెడ్డి, యాదయ్య, శ్రీకాంత్,  కర్ణం వెంకట్ రామ్ రెడ్డి లను ఎస్పీ అభినందించారు.