
జోగిపేట,వెలుగు : అందోల్లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మంగళవారం రాజీనామా చేశారు. తమకు బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, త్వరలోనే కాంగ్రెస్లో చేరతామని ప్రకటించారు. మంగళవారం12 వార్డు కౌన్సిలర్నాగరాజు,14వ వార్డు కౌన్సిలర్ దుర్గేశ్, 20వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ మాట్లాడారు. గతంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యకు వ్యతిరేకంగా మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టినా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పట్టించుకోలేదన్నారు.
ఎమ్మెల్యే మద్దతుతో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తమ వార్డుల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులను అడిగితే ఇవ్వలేదన్నారు. తమపట్ల ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతామని స్పష్టం చేశారు.