నీళ్లలో మునిగి ముగ్గురు మృతి

నీళ్లలో మునిగి ముగ్గురు మృతి
  • మంచిర్యాల జిల్లాలో తండ్రికి భోజనం తీసుకెళ్లిన బాలుడు.
  • ములుగు జిల్లాలో వాటర్‌‌‌‌ఫాల్స్‌‌‌‌ వద్ద మునిగిన స్టూడెంట్‌‌‌‌..
  • జనగామ జిల్లాలో చెరువులో దిగి యువకుడు మృతి

జైపూర్, వెలుగు : తండ్రికి భోజనం తీసుకెళ్తున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌ మండలం టేకుమట్ల శివారులో ఆదివారం జరిగింది. గ్రామానికి చిప్పకుర్తి రమాదేవి, విష్ణువర్ధన్‌‌‌‌ గేదెలను మేపుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ (14) స్థానిక జడ్పీహైస్కూల్‌‌‌‌లో 9వ తరగతి చదువుతున్నాడు. 

విష్ణువర్ధన్‌‌‌‌ రోజు మాదిరిగానే గేదెలను మేపేందుకు గ్రామ శివారులోని సింగరేణి రైల్వే ట్రాక్‌‌‌‌ వైపు వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రి విష్ణువర్ధన్‌‌‌‌కు భోజనం ఇచ్చేందుకు రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఇంటి నుంచి బయలుదేరాడు. సింగరేణి యాజమాన్యం ట్రాక్‌‌‌‌ నిర్మాణ టైంలో పక్కనే మట్టి తవ్వకాలు చేపట్టింది. ఆ కుంటపై నడుచుకుంటూ వెళ్తున్న రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ప్రమాదవశాత్తు కుంటలో  పడిపోయాడు. గమనించిన స్థానికులు రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ను బయటకు తీసే సరికే చనిపోయాడు. దీంతో సింగరేణి సంస్థ ట్రాక్‌‌‌‌ పక్కన తీసిన కుంట వల్లే బాలుడు చనిపోయాడంటూ బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలంటూ రైల్వే ట్రాక్‌‌‌‌పై బైఠాయించారు. 

విషయం తెలుసుకున్న జైపూర్‌‌‌‌ ఎస్సై శ్రీధర్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు ఫయాజోద్దిన్, నాయకులు నర్సయ్య, బల్ల వెంకటేశ్‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌ ఘటనా స్థలానికి చేరుకొని విషయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌‌‌‌ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంది. బొగ్గు తరలించే ట్రైన్‌‌‌‌ను సైతం ఆపేసి ఆందోళన కొనసాగించారు.

కొంగాల వాటర్‌‌‌‌ ఫాల్స్‌‌‌‌ వద్ద

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల జలపాతం వద్ద స్నానం చేస్తూ ఓ స్టూడెంట్‌‌‌‌ చనిపోయాడు. వాజేడు ఎస్సై రుద్ర హరీశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ సమీపంలోని అనురాగ్‌‌‌‌ యూనివర్సిటీలో బీటెక్‌‌‌‌ చదువుతున్న ఏడుగురు యువకులు ఆదివారం వాజేడు మండలం కొంగల గ్రామ సమీపంలోని జలపాతం వద్దకు వచ్చారు. వాటర్‌‌‌‌ఫాల్స్‌‌‌‌ వద్ద స్నానం చేస్తుండగా బి.అభినవ్ (17) అనే స్టూడెంట్‌‌‌‌ నీటిలో గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న వాజేడు ఎస్సై జలపాతం వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా అభినవ్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ దొరికింది. అభినవ్‌‌‌‌ గోదావరిఖని ప్రాంతానికి చెందిన యువకుడిగా, అనురాగ్‌‌‌‌ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతున్నట్లు తెలుస్తోంది. 

స్నానం చేస్తూ చెరువులో మునిగి...

రఘునాథపల్లి, వెలుగు: స్నానం చేసేందుకు చెరువులో దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మల్లంపల్లికి చెందిన గంగాధరి పవన్‌‌‌‌ (24) తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌‌‌‌లోని కొత్తపేటలో ఉంటూ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తన పెద్దనాన్న కొడుకు చనిపోవడంతో గ్రామంలో దశదినకర్మకు పవన్‌‌‌‌ హాజరయ్యాడు. ఆదివారం ఉదయం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు నీటిలో గాలించగా అరగంట తర్వాత పవన్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తెలిపారు.