
- హైదరాబాద్ లో యూపీ వాసుల దారుణం
- ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పరారీలో మరో ఇద్దరు నిందితులు
జూబ్లీహిల్స్, వెలుగు: ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ లో ఈ దారుణం జరిగింది. కొండాపూర్కు చెందిన బాధితురాలు భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నది. సోమవారం పని ముగించుకుని, సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు హైటెక్ సిటీ క్రాస్రోడ్డు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నది. ఆ టైంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమె వద్ద వాహనం ఆపారు. తమ ఇంట్లో బట్టలు ఉతకాలని, అందుకు రూ.500 ఇస్తామని చెప్పారు. అది నిజమని నమ్మిన ఆ మహిళ వారితో కలిసి ఆటో ఎక్కింది. ఆ యువకులు రహ్మత్ నగర్లోనిఓం నగర్లో ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లారు.
ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా లోపలి నుంచి గడియపెట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఈ ఘటనపై రాత్రి 11.30కు బాధితురాలు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్ పూర్కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారి అడ్రస్, ఫోన్ నంబర్లు దొరికాయని వెల్లడించారు. వారు ఇక్కడ పెయింటింగ్ పనులు చేస్తారని, నెల రోజుల క్రితమే ఓంనగర్లో రూమ్ తీసుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.