గురుకులం నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యం

గురుకులం నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యం
  • రెండు రోజుల కింద కనిపించకుండా పోయిన విద్యార్థులు
  • పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుతున్న ముగ్గురు స్టూడెంట్లు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. వివరాల్లోకి వెళ్తే... నేరేడుచర్ల మండలం జాన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌కు చెందిన షేక్‌‌‌‌‌‌‌‌ తౌఫిక్‌‌‌‌‌‌‌‌ ఉమర్, కొండమల్లేపల్లి మండలం కుమ్మడవెల్లికి చెందిన అబ్దుల్‌‌‌‌‌‌‌‌ రహమాన్‌‌‌‌‌‌‌‌, అనుముల మండలం హజారిగూడెంనకు చెందిన ముజీబ్‌‌‌‌‌‌‌‌ కొండభీమనపల్లి మైనార్టీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో టెన్త్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత పక్కనే ఉన్న బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ గోడపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఓ కవర్‌‌‌‌‌‌‌‌ను ముగ్గురు స్టూడెంట్లు తీసుకున్నారు.

 ఈ విషయాన్ని గమనించిన స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌ జ్యోతి కవర్‌‌‌‌‌‌‌‌ను తెరిచి చూడగా అందగులో కల్లు ప్యాకెట్లు కనిపించడంతో వెంటనే ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం బ్రేక్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ అనంతరం ప్రేయర్‌‌‌‌‌‌‌‌ నిర్వహించగా స్టూడెంట్లు షేక్‌‌‌‌‌‌‌‌ తౌఫిక్‌‌‌‌‌‌‌‌, అబ్దుల్‌‌‌‌‌‌‌‌ రహమాన్‌‌‌‌‌‌‌‌, ముజీబ్‌‌‌‌‌‌‌‌ కనిపించలేదు. దీంతో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌ ఆరా తీయగా వారు గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. అనంతరం స్టూడెంట్ల బాక్స్‌‌‌‌‌‌‌‌లను తెరిచి చూడగా అందులో ‘పాఠశాల సిబ్బంది, యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారు, తల్లిదండ్రులు, స్నేహితులు క్షమించాలి, తమ కోసం ఎవరూ వెతకొద్దు’ అని రాసి ఉన్న లెటర్లు కనిపించాయి. 

దీంతో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌ దేవరకొండ పట్టణంలో గాలించినా స్టూడెంట్ల ఆచూకీ తెలియకపోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు కనిపించకుండాపోయారని, వారిని తమకు అప్పగించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసులు స్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

స్కూల్‌‌‌‌‌‌‌‌ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా

కొండభీమనపల్లి మైనార్టీ స్కూల్‌‌‌‌‌‌‌‌ నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యమైన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల లీడర్లు బుధవారం స్కూల్‌‌‌‌‌‌‌‌ వద్ద ధర్నాకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్టూడెంట్లు బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌పై చర్యుల తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేశ్‌‌‌‌‌‌‌‌, దేవరకొండ డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్యదర్శి బుడిగ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, అధ్యక్షుడు రమావత్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, ఏఐఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు, ఎనిమల సాయి, పల్లె కిరణ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.