
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మూడు టెండర్లు దాఖలయ్యాయి. ఈ ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి సంగమేశ్వర బ్యారేజీకి రోజుకు మూడు టీఎంసీలను విడుదల చేయవచ్చు. ఈ ఎత్తిపోతలకు సంబంధించి రూ.3,278.18 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులకు గత నెల 27వ తేదీన ఆన్లైన్లో టెండర్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 10 అని జల వనరుల శాఖ వెల్లడించింది. ఈ నెల 13వ తేదీన టెక్నికల్ బిడ్లు, 17న ఫైనాన్సియల్ బిడ్లు తెరుస్తామని.. అదే రోజు రివర్స్ టెండర్కు వెళ్తామని తెలిపింది. అయితే అధికారులు మాత్రం బుధవారమే టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేశారు. వాటిలో ఎస్పీఎంఎల్-మేఘా-ఎన్సీసీ జాయింట్ వెంచర్, నవయుగ ఇన్ఫ్రా, మరియు మ్యాక్స్ ఇన్ఫ్రా సాంకేతిక అర్హతను సాధించాయి. ఈ నెల 17వ తేదీన ఈ కంపెనీల ఫైనాన్సియల్ బిడ్లను ఓపెన్ చేస్తారు. అదేరోజున ఎల్-1గా వచ్చిన సంస్థ ఎంత మొత్తం బిడ్ వేసిందో వెల్లడిస్తారు. దానిపై అన్లైన్లోనే రివర్స్ టెండర్కు వెళ్తారు. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నానికే ఈ పనులు దక్కించుకున్న సంస్థను జల వనరుల శాఖ ప్రకటిస్తుంది. ఒకసారి పనులు మొదలుపెట్టిన తర్వాత.. 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.
For More News..