ఉస్మానియాలో మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి

ఉస్మానియాలో మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి

కాలేయ మార్పిడితో ఓ మూడేళ్ల చిన్నారికి పునర్జన్మని ప్రసాదించారు ఉస్మానియా వైద్యులు. పుట్టుక‌తోనే పిత్తాశ‌య ధ‌మ‌ని, కాలేయ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న బాలుడికి శస్త్రచికిత్స చేసి  ప్రాణాలు కాపాడారు. ఉస్మానియా వైద్యులు మ‌ధుసూద‌న్ నేతృత్వంలోని స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుప‌త్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది.ఖ‌మ్మం జిల్లా కొణిజ‌ర్ల మండ‌లం కొండ‌వ‌న‌మాల గ్రామానికి చెందిన మోదుగు గుణ‌శేఖ‌ర్‌, అమ‌ల దంప‌తుల కుమారుడు మాస్టర్ చోహ‌న్ ఆదిత్య (3 సంవ‌త్సరాలు) పుట్టుక‌తోనే పిత్తాశ‌య ధ‌మ‌ని, కాలేయ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నాడు .  దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడిని చికిత్స నిమిత్తం గత నెల ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చోహాన్​ కు ఈనెల 3 వ తేదీన ఆపరేషన్​ చేశారు..చోహ‌న్ ఆదిత్య మాతృమూర్తి అమ‌ల కాలేయాన్ని త‌న కుమారునికి దానం చేయ‌డంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమ‌ర్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో మంగళవారం ( జులై16) చోహాన్​ ను  డిశ్చార్చ్‌ చేశారు. ఉస్మానియాలో ఇప్పటివరకుఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారుల‌తో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజ‌యవంతంగా పూర్తి చేశారు.  . ప్రైవేట్‌ ఆస్పత్రిలో రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీలు ఉస్మానియాలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల బృందాన్ని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఉస్మానియా ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు..