కేయూలోత్రిసభ్య కమిటీ విచారణ షురూ

కేయూలోత్రిసభ్య కమిటీ విచారణ షురూ

వరంగల్‍/కేయూ క్యాంపస్‍, వెలుగు: వరంగల్​కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‍డీ అడ్మిషన్లపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం క్యాంపస్​లో పర్యటించింది. కమిటీ సభ్యులైన ఉన్నత విద్యామండలి వైస్‍ చైర్మన్‍ ప్రొఫెసర్‍ వెంకటరమణ, ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్‍ పాండురంగారెడ్డి, టెక్నికల్‍ ఎడ్యుకేషన్‍, జాయింట్‍ సెక్రటరీ వెంకటేశ్వర్లు దాదాపు 40 నిమిషాలు కేయూ వీసీ తాడికొండ రమేశ్​తో సమావేశమయ్యారు. అనంతరం డిపార్ట్ మెంట్ల వారీగా డీన్లతో మాట్లాడారు.

ప్రధానంగా అడ్మిషన్ల టైంలో యూజీసీ గైడ్‍లైన్స్ ఎలా ఉన్నాయి? వాటిని ఎంతవరకు ఫాలో అయ్యారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. తర్వాత స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్ల నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధిత స్టూడెంట్లు మాట్లాడుతూ.. అడ్మిషన్లలో తమకు అన్యాయం జరిగిందని, వర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. విచారణ పూర్తయ్యాక కమిటీ సభ్యులు ప్రభుత్వానికి రిపోర్టు అందజేయనున్నారు.