
- తల, మెడపై బుల్లెట్ గాయాలు.. పంజాబ్లో ఘటన
చండీగఢ్: పంజాబ్లో దారుణం జరిగింది. అమృత్సర్ జిల్లా డబుర్జి గ్రామంలో నివసిస్తున్న ఓ ఎన్నారైపై ఇద్దరు దుండగులు పాయింట్ -బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అమెరికాకు చెందిన సుఖ్చైన్ సింగ్ అనే ఎన్నారై నెల క్రితం తన కుటుంబంతో సహా డబుర్జికి వచ్చారు. ఓ హోటల్, లగ్జరీ కారు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తలపాగా ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై సుఖ్చైన్ సింగ్ ఇంటికి వచ్చారు.
లగ్జరీ కారు గురించి మాట్లాడాలనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించారు. హఠాత్తుగా దుండగుల్లో ఒకరు సుఖ్చైన్ సింగ్ను బెడ్రూమ్లోకి వెళ్లాలని తుపాకీతో బెదిరించాడు. దానికి సుఖ్చైన్ సింగ్ నిరాకరించడంతో అతనిపై ఇద్దరు దుండగులు పాయింట్- బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. తల, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఎన్నారై కుటుంబసభ్యులు దండం పెట్టి ప్రాధేయపడినా దుండగులు పట్టించుకోలేదు. కాల్పులు జరిపి బైకుపై పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన సుఖ్చైన్ సింగ్ను స్థానికులు వెంటనే అమృత్సర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి.