దేవుడా.. మన ఆలయాల్లో టికెట్ల దందా బాగోతాలు ఇవే

దేవుడా.. మన ఆలయాల్లో టికెట్ల దందా బాగోతాలు ఇవే

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో టికెట్ల అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బందిని భక్తులు సౌకర్యాలపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని  ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఏండ్ల తరబడి ఒకే ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా  మారింది. ఈ క్రమంలోనే అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని  తెలుస్తోంది.   

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..

  • గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల  వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి పదేండ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్‌‌ చేయించి విక్రయించాడు. టికెట్‌‌ కౌంటర్‌‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి ఒక్క రోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు రూ.31 వేలు వసూలు చేశాడు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన సూపరింటెండెంట్‌‌ ప్రింటింగ్‌‌లో పొరపాటు జరిగిందని చెప్పి చేతులు దులుపుకొన్నారంటే సిబ్బంది సైతం పై స్థాయి అధికారులను ఎలా ప్రభావితం చేస్తున్నారో స్పష్టమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ ఈవో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  
  •     చెర్వుగట్టు దేవస్థానంలోనూ నకిలీ టికెట్ల దందా జరిగింది. గతంలో గుట్టపై దర్శనీయ స్థలాల్లో టికెట్ల రీసైక్లింగ్‌‌ జరగగా.. గుట్ట కింద ప్రైవేట్‌‌ పార్కింగ్‌‌ ప్రదేశాల్లో దేవస్థానం పేరిట పార్కింగ్‌‌ ఫీజును వసూలు చేసిన విషయం వెలుగు చూసింది. పార్కింగ్‌‌ స్థలంలో పార్క్‌‌ చేసిన బైక్‌‌ చోరీ కావడంతో బాధితుడు దేవస్థానాన్ని సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
  •     కొమురవెల్లి మలన్న ఆలయంలోనూ గతంలో వీఐపీ టికెట్లను విక్రయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో గతంలో చైర్మన్ , ఈవో మధ్య విభేదాలు పొడుచూపాయని తెలిసింది. 
  •   బాసర ఆలయంలో లడ్డూ టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఇందుకు బాధ్యులైన ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్‌‌తోపాటు నలుగురు రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

వీఐపీ టికెట్ల లో గోల్ మాల్.. 

ఆలయాలకు ప్రముఖులు వచ్చినప్పడు వారికి ప్రత్యేకంగా టికెట్లు కేటాయిస్తారు. రద్దీని బట్టి రోజుకు 200 నుంచి 500 మంది వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. అయితే, ఈ టికెట్లకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, కొన్ని ప్రముఖ ఆలయాల్లో ఈవోతోపాటు ఉద్యోగులు, సిబ్బంది టికెట్లను భక్తులకు వీఐపీ టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.  రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు క్యూలైన్లో నిల్చొని ఉండలేరు. కాబట్టి వారిని టార్గెట్ చేసి టికెట్లు విక్రయిస్తుంటారని సమాచారం.

సాధారణంగా దర్శనం టికెట్ రూ.500 ఉంటే.. 10 మందికి రూ.5వేలు అవుతుంది. ఇంత డబ్బు ఎందుకు.. క్యూలైన్​లో వెళ్దామని భక్తులు అనుకుంటారు. అయితే, అలాంటి వారికి వీఐపీ టికెట్ ను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ రూ.5 వేలకు వచ్చే టికెట్​ రూ.2 వేలకే లభిస్తుండడంతో కొనుగోలు చేస్తుంటారు. ఇలా ప్రముఖ ఆలయాల్లో రోజు వీఐపీ టికెట్లు 200 నుంచి 300 వరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.