
జగిత్యాల టౌన్, వెలుగు: టిమ్ మిషన్ పని చేయక.. జీరో టికెట్ ఇష్యూ చేయలేనంటూ 20 మంది మహిళలను జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపుర్ గ్రామ శివారులో కండక్టర్ దింపివెళ్లిపోయాడు. గురువారం రాత్రి 8గంటలకు జగిత్యాల నుంచి ధర్మారం వెళ్తున్న జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసి బస్సులో టిమ్ మిషన్ పనిచేయలేదు. చెకింగ్ అయితు తన ఉద్యోగం పోతుందంటూ వారిని బస్సుల్లోంచి దింపేశాడు. రాత్రిపూట మహిళలని చూడకుండా గ్రామ శివారులో దించేసి వెళ్లడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో జగిత్యాలకు చేరుకోవడానికి వారు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సునీతను వివరణ కోరగా తనకు పూర్తి సమాచారం అందలేదని తెలిపారు.