రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..?

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..?

న్యూఢిల్లీ: వాలంటైన్స్ డే వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ఖరారు చేసింది. 2025, ఫిబ్రవరి 24వ తేదీన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేస్తామని వెల్లడించింది. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని మోడీ బీహార్‎లోని భాగల్పూర్‎లో పర్యటిస్తారని.. ఈ సందర్భంగా ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే.. బీహార్‎లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం భాగల్పూర్‎లో ఏర్పాటు చేసే సభలో పాల్గొని మోడీ ప్రసంగిస్తారు. పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తోన్న రైతులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి.

కాగా, దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహయం చేయడం కోసం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం మూడు విడతల్లో ఏడాదికి రూ.6 ఆర్థిక సహయం అందజేస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో రైతులకు ఖాతాల్లో కేంద్రం నిధులు జమ చేస్తోంది. ఇందులో భాగంగానే.. 2024, అక్టోబర్ 5న 18వ విడత పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లో జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24న 19 విడత నిధులను రైతుల అకౌంట్లలో వేయనుంది. 

పీఎం కిసాన్ స్కీమ్ అర్హతలు:

  • భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి
  • చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. 
  • సాగు భూమిని కలిగి ఉండాలి
  • నెలకు కనీసం రూ. 10,000 పెన్షన్ పొందే పదవీ విరమణ చేసిన వ్యక్తి కాకూడదు.
  • ఆదాయపు పన్ను దాఖలు చేయకూడదు
  • సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

  • పీఎం కిసాన్ యోజన పథకం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. 
  • ఇక్కడ కూడా Pradhan Mantri Kisan Samman Nidhi  పోర్టల్ కు వెళ్లాలి. 
  • Farmers Corner క్లిక్ చేయాలి. తర్వాత New Farmers Corner క్లిక్ చేసి ఆధార్ నెంబర్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. 
  • captcha codeను టైప్ చేయాలి. 
  • అనంతరం లబ్దిదారుడి వివరాలను ఎంటర్ చేయాలి.
  • బ్యాంకు ఖాతా, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎంట్రీ చేయాలి. 
  • సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి. 
  • ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చే దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.

పీఎం- కిసాన్ eKYC పూర్తి చేయడం ఇలా..

  • పీఎం - కిసాన్ అధికారిక వెబ్ సైట్ (https.//pmkisan.gov.in/)ను సందర్శించాలి. 
  • కుడి వైపున అందుబాటులో ఉన్న eKYCపై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం Capcha కోడ్ ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. 
  • Get OTPపై క్లిక్ చేయండి. వచ్చిన OTPని నమోదు చేయాలి.
  • అన్ని వివరాలు సరైనవి అయితే.. eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే.. స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.