
దేశంలోనే అత్యున్నత సర్వీస్లో అడుగుపెట్టడానికి యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలో ప్రిలిమ్స్ పూర్తయింది. 10,564 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. జనవరి 8 నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ ఎలా క్లియర్ చేయాలి.., ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్లాలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గైడెన్స్..
అంత్యంత క్లిష్టమైన మూడంచెల సివిల్స్ ఎగ్జామ్లో రెండో దశ మెయిన్స్ మరో రెండు నెలల్లో జరుగనుంది. అభ్యర్థులు ప్లాన్ ప్రకారం ప్రతిరోజూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ మార్క్స్ వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలి.
ఎస్సే, ఎథిక్స్, ఆప్షనల్స్..
మెయిన్స్ ఎగ్జామ్ మంచి మార్కులతో క్లియర్ చేయాలంటే ఎస్సే, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్, ఆప్షనల్ సబ్జెక్ట్స్పై మంచి పట్టు ఉండాలి. వీటిలో మంచి మార్క్స్ వస్తే మెయిన్స్ ఈజీగా క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మెయిన్స్ 1750 మార్కుల్లో 1000 మార్కులు ఈ సబ్జెక్ట్స్ నుంచే వస్తున్నాయి. మిగిలిన 750 మార్కులు జనరల్ స్టడీస్కు కేటాయించారు. ఇప్పుడు ప్రిలిమ్స్లో లేని సిలబస్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ ఛానల్స్, పేపర్స్ ఫాలోకావాలి.
రైటింగ్ ప్రాక్టీస్..
మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే వారానికి రెండు సార్లు సాధన చేయాలి. వ్యాసాలకు(ఎస్సే) కరెంట్ అఫైర్స్ లింక్ చేసి ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎస్సేలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిలాసఫీ, ఎకానమీ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. ఎథిక్స్ ఇంటెగ్రిటీ ఆప్టిట్యూడ్ పేపర్లో కేస్ స్టడీస్ ముఖ్యమైనవి. ఇవే ఎక్కువగా స్కోరింగ్. కేస్ స్టడీస్ ఆధారంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ బాగా చదవాలి. ఉదాహరణలతో జవాబులు రాస్తే ఎక్స్ ట్రా మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. పాలన(గవర్నన్స్)కు సంబంధించిన అంశాల నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆప్షనల్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేసేలా అభ్యర్థులు నోట్స్ తయారు చేసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
పాలిటీపై పట్టు..
ఇండియన్ పాలిటీపై అభ్యర్థులు పట్టు సాధించాలి. సర్వీస్ లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇండియన్ సొసైటీ అంశాలకు ఎన్సీఆర్టీ పదకొండు, పన్నెండో తరగతి బుక్స్ చదవాలి. ఇంటర్నెట్ ఉపయోగించి ఏఆర్సీ రిపోర్ట్స్, పాలనకు సంబంధించిన అంశాలను నేర్చుకోవాలి. పాలిటీ కోసం డి.డి.బసు బుక్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. కరెంట్ అఫైర్స్ కోసం ది హిందు, బిగ్ పిక్చర్, రాజ్యసభ టీవీ, పీఆర్ఎస్ ఇండియా, ఆల్ ఇండియా రేడియ వెబ్సైట్లు మరియు యోజన లాంటి మ్యాగజైన్స్ ప్రిపేర్ అవ్వాలి. అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) తీర్పుల్లో ముఖ్యమైనవి రిఫరెన్స్గా రాయవచ్చు. ఏదైన అంశం చర్చించేటప్పుడు ఇరువైపుల వాదనలు రాయాలి. ఆరోగ్యం, మహిళలు, విద్య, పేదరికం, ఉపాధికి సంబంధించిన గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ సంబంధాల గురించి చదవడం మర్చిపోవద్దు.
సర్వేలు, కరెంట్ అఫైర్స్పై దృష్టి..
జనరల్ స్టడీస్లోని పేపర్-3 కోసం బడ్జెట్, ఆర్థిక సర్వేల మీద ఫోకస్ చేయాలి. ఇందులో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అగ్రికల్చర్, భూ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అంశాలపై అప్డేట్ అవ్వాలి. విపత్తు నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) కోసం ఎన్డీఎమ్ఏ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా విజయం మీదే.
రివిజన్ ముఖ్యం
చాలా మంది అభ్యర్థులు కొత్త పుస్తకాలు కొని ఎక్కువగా చదవాలనే అపోహలో ఉంటారు. తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదివి రివిజన్, మైండ్ మ్యాప్ చేసుకుంటే ఎగ్జామ్లో బాగా రాయవచ్చు. సిలబస్ లో ఉన్న అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
అర్హత పేపర్స్ మర్చిపోవద్దు
అర్హత పేపర్లు(ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్) మర్చిపోకుండా వాటికోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. టైమ్ మేనేజ్ చేసుకుంటూ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాసేలా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాయాలి. దీంతో అభ్యర్థులు చేసే తప్పులు సరిచేసుకునే వీలు కలుగుతుంది. ప్రశ్నకు సరైన ఆన్సర్ సూటిగా రాయాలి స్పేస్ పరిమితంగా ఉంటుంది. జవాబులు పాయింట్స్, ఫ్లోచార్ట్ రూపంలో రాయాలి. జనరల్ స్టడీస్ లో ఎక్కువ మార్కులు పొందడానికి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఇంటర్నెట్ ద్వారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో చూడడం ద్వారా సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది. మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చదివేటప్పడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చారిత్రక సంఘటనలు గుర్తుంచుకోవాలి.
– డి.నిహారిక రెడ్డి, ఐఏఎస్ బ్రైన్స్ డైరెక్టర్