సిద్దిపేట, వెలుగు : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేటలోనూ నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుంచి ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస రాజుతో కలిసి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిద్దిపేట లో నిర్మించే టీటీడీ ఆలయ నమూనాను పరిశీలించి మాట్లాడారు. తిరుపతి వేంకటేశ్వర స్వామిని ప్రజలంతా ఇష్ట దైవంగా, ఇలావేల్పులా కొలుస్తారని, అలాంటి ఆలయాన్ని సిద్దిపేటలో నిర్మించనుడడం అదృష్టమన్నారు.
అన్ని వసతులతో నిర్మాణం చేపట్టాలని , ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపన శ్రావణ మాసంలో జరిగేలా చూడాలన్నారు. ఇటీవల సిద్దిపేట లో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఆలయ నమూనా, డిజైన్స్ ను మంత్రి పరిశీలించగా దాదాపు రూ.30 కోట్ల ఆలయ నిర్మాణ ప్రణాళికను రూపొందించినట్టు టీటీడీ అధికారులు వివరించారు.