
నల్గొండ అర్బన్ వెలుగు : కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ దోహదపడుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్గొండలోని కలెక్టరేట్లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ రహదారి పక్కన ఉన్న చిన్న వ్యాపారస్తులు, హోటళ్లలో అమ్ముతున్న ఆహార నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్సేఫ్టీ ఆన్వీల్ ఉపయోగపడుతుందన్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ ఉందో.. లేదో ఈ వాహనంలో పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అనంతరం నల్గొండలోని ప్రగతి జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ వి.జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారులు పి.స్వాతి, శివశంకర్ రెడ్డి, ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.