
దేశంలో ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంజనీర్లు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం ఆనందదాయకం. నిజాయితీ, పట్టుదల, అంకితభావం ఉండే ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. నేడు ‘ఇంజనీర్స్ డే’. ఇంజనీరింగ్ రంగంలో ఎన్నో సేవలందించి, సమాజంలో విశిష్ట స్థానాన్ని పొందిన వారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖలు. ఈ ఒక్క రంగంలోనే కాకుండా విద్య, పారిశ్రామిక, సామాజిక తదితర రంగాల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పిన మేధావి ఆయన. విశ్వేశ్వరయ్య ప్రస్తుత ఇంజనీర్లకు, విద్యార్థులకు ఆదర్శప్రాయులు. ఆయన15 సెప్టెంబర్1861లో కర్నాటకలోని ముద్దనహల్లి గ్రామంలో పుట్టారు. సొంత ఊరిలో ప్రాథమిక విద్యను, హయ్యర్ స్టడీస్ బెంగళూరులో పూర్తి చేశారు. 1883లో పూనా సైన్స్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. ఈ రంగంలో వివిధ హోదాల్లో పని చేశారు. అప్పుడే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూట్టారు. కర్నాటకలో కృష్ణసాగర్ డ్యాం, దేశంలో విలువైన ఆస్తిగా పిలుస్తున్న భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ, మైసూర్సాండల్ సోప్ ఫ్యాక్టరీ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యత కారణంగా దేశంలో అనేక పథకాలను విశ్వేశ్వరయ్య రూపొందించారు. నీటి వృథాను అరికట్టడానికి ‘బ్లాక్ సిస్టమ్’ అనే సరికొత్త పద్ధతిని రూపొందించారు. హైదరాబాద్లోని మూసీ నది వరదలను అరికట్టేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల రూపకల్పన కూడా విశ్వేశ్వరయ్య చేపట్టిందే. బంధు ప్రీతి లేకుండా నిష్పక్షపాతంగా ఉండటం ఆయన ప్రత్యేకత. ప్రభుత్వ వాహనాలను సొంతంగా ఉపయోగించే వారు కాదు. తన బాధ్యతలను కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే వెచ్చించే వారు. రిటైర్మెంట్ తర్వాత ఎన్నో దేశాలు పర్యటించి అక్కడి నిర్మాణ వ్యవస్థను పరిశీలించి1920లో ‘భారత పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళికా బద్ధమైన ఆర్థిక విధానం’ అనే పుస్తకాలు రాశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1955లో ఆయనను భారత ప్రభుత్వం ‘భారత రత్న’ బిరుదుతో సత్కరించింది. ఆయన పేరు మీదుగానే ఏటా ‘ఇంజనీర్స్ డే’ నిర్వహిస్తున్నారు. - పి.మోహన్ చారి