
- ఔటర్ రింగ్రోడ్పై పెరిగిన టోల్ చార్జీలు
- అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
- 158 కిలో మీటర్ల 8 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు
- టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా
- 30 ఏండ్ల పాటు లీజుకు ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్
- హైదరాబాద్– విజయవాడ రూట్లో తగ్గిన టోల్ రేట్లు
హైదరాబాద్ సిటీ/నల్గొండ, వెలుగు: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. మొత్తం 158 కిలో మీటర్ల పొడవు ఉన్న 8 లేన్ల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రయాణించే వాహనాల నుంచి ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు చేయనున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిలో ఈ రోడ్డును 30 ఏండ్లపాటు ఐఆర్బీ ఇన్ఫ్రాకు లీజుకు ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కంపెనీయే టోల్ వసూలు చేస్తున్నది.
పెరిగిన టోల్ చార్జీలు ఇలా..
కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కు కిలో మీటర్కు అదనంగా 10 పైసలు పెంచారు. ప్రస్తుతం ఈ తరహా వాహనాలకు కిలో మీటర్కు రూ.2.34 ఉండగా.. తాజాగా రూ.2.44కు పెంచారు. అలాగే మినీ బస్సు, ఎల్సీవీలకు కిలో మీటర్కు 20 పైసలు పెంచారు. గతంలో వీటికి కిలో మీటర్కు రూ.3.77 ఉండగా... ఇప్పుడు రూ.3.94కు పెరిగింది. బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. 3 -యాక్సిల్ కమర్షియల్ వెహికల్స్కు కిలో మీటర్ కు 70 పైసలు పెంచారు. అంటే.. గతంలో కిలో మీటర్కు రూ.8.31 కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు రూ.9.01 పే చేయాల్సి ఉంటుంది.
భారీ వాహనాలకు కిలో మీటర్కు 70 పైసలు పెంచారు. గతంలో కిలో మీటర్కు రూ.15.09 వసూలు చేస్తుంటే.. ఇప్పుడు రూ.15.78కు పెంచినట్లు ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రకటించింది. ఓఆర్ఆర్.. 158 కిలో మీటర్ల ఔటర్ నేషనల్ హైవేలను కలుపుతున్నది. ఓఆర్ఆర్పైకి ఎక్కడానికి, దిగడానికి 44 పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా, 22 ఇంటర్ ఎక్స్ఛేంజ్ జంక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు ఔటర్పై 1.40 లక్షల నుంచి 1.45 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
హైదరాబాద్– విజయవాడ రూట్లో ఊరట
హైదరాబాద్ – -విజయవాడ రూట్లోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకున్నది. తగ్గిన టోల్ ట్యాక్స్ సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ – --విజయవాడ రూట్కు సంబంధించి తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
వీటిల్లో అత్యధికంగా పంతంగి టోల్ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, లైట్ మోటార్ ట్రాన్స్ పోర్టు వాహనాలకు అయితే ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40 వరకు తగ్గినట్లు ఎన్ హెచ్ఏఐ పేర్కొన్నది. బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గింది. సవరించిన టోల్ ట్యాక్స్లు 2026, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. గతేడాది జులై 1 నుంచి టోల్ వసూళ్లు ఎన్హెచ్ఏఐ చేతికి వెళ్లాయి. అంతకు ముందు వరకు జీఎంఆర్ సంస్థ టోల్ వసూలు చేసేది. 2024, జులై 1 నుంచి ఈ బాధ్యతను ఎన్హెచ్ఏఐ తీసుకుని ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేస్తున్నది.