![క్యాన్సర్తో పోరాడుతున్న టాలీవుడ్ నటి](https://static.v6velugu.com/uploads/2021/12/Tollywood-actress-Hamsa-Nandini-has-been-diagnosed-with-cancer_QMgbiRdAK6.jpg)
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటి హంసా నందిని రీసెంట్ గా క్యాన్సర్ బారిన పడ్డారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు వారికి ఆమె చేరువైంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాను క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ పోస్టుల ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం తాను క్యాన్సర్ పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తానని హంసా నందిని పేర్కొంది. కాలం తన జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదని ఇన్ స్టా పోస్టులో హంసా నందిని రాసుకొచ్చింది.
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC
— Hamsa Nandini (@ihamsanandini) December 20, 2021
‘18 ఏళ్ల కింద క్యాన్సర్తో నా తల్లి కన్నుమూశారు. అప్పటి నుంచి నేను అదే భయంతో జీవిస్తున్నా. నాలుగు నెలల కింద రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించా. టెస్టుల తర్వాత నాకు రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అనుకున్నా. కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తాజాగా నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. దాని నుంచి తప్పించుకునేందుకు సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి’ అని హంసా నందిని తెలిపింది. ప్రస్తుతానికి 9 కీమో థెరపీలు చేయించుకున్నానని.. మరో ఏడు చేయించుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. నవ్వుతూ పోరాడతానని తెలిపింది. కాగా, హంసా నందిని తెలుగులో చాలా మూవీస్ లో నటించారు. మిర్చి, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్, భాయ్, అత్తారింటికి దారేది సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నారు.
మరిన్ని వార్తల కోసం: