
- నష్టంతో లబోదిబోమంటున్న రైతులు
మెదక్, శివ్వంపేట, వెలుగు: వైరస్ సోకి టమాట మొక్కలు చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట మండలాల్లో 1,800 ఎకరాల్లో టమాటా సాగవుతోంది. యాసంగిలో వరి సాగు చేస్తే నీటి తడులు సరిపడ అందకుంటే ఇబ్బందవుతుందని ఎక్కువ మంది రైతులు టమాటా సాగు చేశారు.
కానీ కొద్ది రోజులుగా టమాట తోటలకు వైరస్ సోకుతోంది. శివ్వంపేట మండలంలోని చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల, శివ్వంపేట, గోమారం, నవాపేట్, సికింద్లాపూర్, గుండ్లపల్లి, ఉసిరికపల్లి, పోతులబొగడ, పాంబండ గ్రామాల్లో రైతులు దాదాపు 200 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఇందులో సుమారు 60 ఎకరాల్లో వైరస్ సోకింది. దీంతో పెద్ద సంఖ్యలో మొక్కలు చనిపోతున్నాయి. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా వైరస్ అదుపు కావడం లేదని రైతులు చెబుతున్నారు. లాభాల మాట అటుంచి పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
హార్టికల్చర్ సిబ్బందిని ఫీల్డ్కు పంపి టమాట తోటలను పరిశీలింపజేస్తాం. నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. పంటను కాపాడే ప్రయత్నం చేస్తాం.
నర్సయ్య, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్