
ఆకాశంలో రాత్రి వేళ అద్భుతం చూసే సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో (మార్చి 14) ఆకాశంలో బ్లడ్ మూన్ ఏర్పడనుంది. 2025 సంవత్సరంలో వచ్చే తొలి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఇండియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే రోజు హోలీ కావడం విశేషం.
దాదాపు రెండేళ్ల తర్వాత సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. సూర్యుడికి, చంద్రుడికి సరిగ్గా మధ్యలో భూమి వచ్చినప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం మనుషులపై ప్రభావం చూపుతుందని వివిధ సంస్కృతుల్లో భాగంగా నమ్ముతుంటారు. భారతదేశంలో ఆధ్యాత్మికంగా కూడా దీనికి చాలా ప్రత్యేకత ఉంది.
బ్లడ్ మూన్:
హోలీ రోజు ఏర్పడే చంద్రగ్రహణం రోజు బ్లడ్ మూన్ చూడొచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఆ రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. సూర్యుడు చల్లబడి వచ్చాడా అన్నట్లు ఉంటుంది ఆ రోజు జాబిల్లి. అయితే బ్లడ్ మూన్ ను ఇండియా నుంచి నేరుగా చూడలేం. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు, అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల నుంచి మాత్రమే బ్లడ్ మూన్ కనిపిస్తుంది.
ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7,8 తేదీలలో ఏర్పడే అవకాశం ఉంది. రెండవ సారి ఏర్పడే చంద్ర గ్రహణం భారతదేశం నుంచి కనిపిస్తుందని చెబుతున్నారు.
సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత:
చంద్రగ్రహణానికి ఇండియాలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మార్చి 14 న హోలీ ఉంది. హోలీని వసంత రుతువు రాకకు అదేవిధంగా చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇలాంటి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం అరుదైన ఘటనగా జ్యోతిష్యులు చెబుతున్నారు.
ప్రభావం ఎలా ఉంటుంది..?
హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణం ప్రాముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. పూర్ణిమ తిథి రోజు చంద్రుని నుంచి భూమిపై పడే కిరణాలు చాలా పవిత్రమైనవిగా జోతిష్యులు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా మనసును నిర్మలంగా మార్చుకోవడానికి, వివిధ కార్యక్రమాలకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.
ఆధ్యాత్మికత, మెడిటేషన్, వ్యక్తి తనగురించి తాను తెలుసుకునేందుకు ఈ రోజు ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తనను తాను మార్చుకోవడానికి, కొత్త అలవాట్లను, అభ్యాసాన్ని అలవర్చుకునేందుకు సరైన సమయం అని అంటున్నారు.