ఢిల్లీ లిక్కర్ స్కాం 1100 కోట్ల నేరం

ఢిల్లీ లిక్కర్ స్కాం 1100 కోట్ల నేరం
  • 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉంది
  • 192 కోట్ల లాభాలు పొందిన ఇండో స్పిరిట్
  • ఏ1 గా సమీర్ మహేంద్రు, ఏ3గా ఇండో స్పిరిట్స్
  • ఏ 32గా కవిత, ఏ 29గా మనీష్ సిసోడియా
  • ఇండో స్పిరిట్ ద్వారా ఆప్ కు రూ. 100 కోట్లు
  • డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిన కవిత
  • రౌస్ అవెన్యూ కోర్టులో 177 పేజీలో ఈడీ సప్లమెంటరీ చార్జ్ షీట్ 

ఢిల్లీ: లిక్కర్ స్కాం మొత్తం 1100 కోట్ల  నేరమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)  ఇవాళ దాఖలు చేసిన చార్జి షీట్ లో పేర్కొంది. 292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని తెలిపింది.  లిక్కర్ పాలసీ మార్పు ద్వారా కవిత 33% భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీ  192 కోట్ల లాభాలు పొందిందని పేర్కొన్నది. కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిళ్లయ్ ఉన్నారని తెలిపింది. 2021–2022 లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు గాను రూ. 100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ నాయర్ ద్వారా కవిత సమకూర్చారని చార్జీ షీట్ లో పొందు పర్చింది. కవిత పీఏ అశోక్ కౌశిక్ ద్వారా డబ్బులు ఆప్ కు ఎలా వెళ్లాయి.. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ కు ఎన్నికోట్ల ముడుపులు సమకూర్చారు అనే అంశాలను ప్రధానంగా చార్జిషీట్ లో ప్రస్తావించారు. ఈ కేసులో ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2గా ఖావో గలీ రెస్టారెంట్, బబ్లీ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు. ఇండో స్పిరిట్ సంస్థ ఏ3గా పేర్కొన్నారు ఈడీ అధికారులు. ఈ డీల్ మొత్తంలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి. ఎవరెవరు పాల్గొన్నారు..? డబ్బులను ఎలా మళ్లించారనే అంశాలను ఈడీ చార్జిషీట్ లో ప్రస్తావించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ 32 గా ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఏ 29గా ఉన్నారు. 

డిజిటల్ ఆధారాల ధ్వంసం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ తన చార్జి షీట్ లో పేర్కొంది. మొత్తం 177 పేజీలతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో అనేక అంశాలను ఈడీ ప్రస్తావించింది.