హైదరాబాద్ వెస్ట్ సిటీలో టూరిజం సర్క్యూట్​ రింగ్.. ​కనెక్టివిటీతో మారనున్న రూపురేఖలు

హైదరాబాద్ వెస్ట్ సిటీలో టూరిజం సర్క్యూట్​ రింగ్.. ​కనెక్టివిటీతో మారనున్న రూపురేఖలు
  • బాపూఘాట్​, తారామతి, ఏకో పార్క్​, ట్రెక్​  పార్కుకు కనెక్టివిటీ
  • రోడ్లు, ఫుడ్​కోర్టులు,  షాపింగ్​ సెంటర్ల నిర్మాణం 
  • పీపీపీ పద్ధతిలో నిర్మించాలని  హెచ్ఎండీఏ ప్లాన్​ 
  • సంస్థల నుంచి ఎక్స్​ప్రెస్​ ఆఫ్​ఇంట్రెస్ట్​కు ఆహ్వానం

హైదరాబాద్​ సిటీ, వెలుగు :  హైదరాబాద్ వెస్ట్​సిటీలో టూరిజం డెవలప్​ చేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది.  ఇందుకు ‘ వెస్ట్ హైదరాబాద్ టూరిజం సర్క్యూట్’ పేరుతో కొత్వాల్ గూడ ఎకో పార్క్, బాపూఘాట్, తారామతి –బారాదరి, చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కులను కలిపి ఒక  సర్క్యూట్ కనెక్టివిటీతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.  

పీపీపీ (పబ్లిక్​– ప్రైవేట్ –  పార్ట్​నర్​ షిప్)పద్ధతిలో డెవలప్ ​చేసేందుకు సంస్థలను ఎక్స్​ప్రెస్​ ఆఫ్​ ఇంట్రస్ట్​ కోసం  ఆహ్వానిస్తూ నోటిఫికేషన్​ జారీ చేసింది. ప్రాజెక్టును చేపట్టే సంస్థ డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్​ఫర్​(డీబీఎఫ్​ఓటీ) పద్ధతిలో పనులు చేయాల్సి ఉంటుంది. భూముల అప్పగింత, ఇతర మౌలిక సదుపాయాల కల్పన హెచ్ఎండీఏ చూసుకుంటుంది.  

టూరిజం సర్క్యూట్​ ఇలా...

సిటీలోని లంగర్​హౌస్ ​నుంచి తారామతి బారాదరి 3.8 కి.మీ , బాపూఘాట్​నుంచి కొత్తగూడ ఏకో పార్క్​13.50 కి.మీ, హిమాయత్​సాగర్ ​నుంచి నార్సింగిలోని ట్రెక్​ పార్క్​7.5 కి.మీ , ఫారెస్ట్ ​ట్రెక్​పార్క్ ​నుంచి తారామతి బారాదరి 6 కి.మీ  కలిపి మొత్తం 31 కి.మీ. మేరకు రింగ్​ సర్క్యూట్​ గా నిర్మించనుంది.  దీని వల్ల టూరిస్టులు నాలుగు ప్రాంతాలను ఈజీగా విజిట్ ​చేసుకునే చాన్స్  ఉంటుంది.  

ఆయా రూట్లలో కొత్త రోడ్లను నిర్మించడంతో పాటు టూరిస్టులను ఆకట్టుకునేందుకు షాపింగ్​సెంటర్లు, ఫుడ్ ​కోర్టులు, ఎంటర్​టైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు చేస్తారు. రోడ్లు, షాపింగ్​సెంటర్లు, ఫుడ్​స్టాల్స్​అన్నీ ఆకట్టుకునే రీతిలో సదరు సంస్థలే డిజైన్​చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన వ్యయాన్ని భరించడం, నిర్వహణ బాధ్యతలు చూసుకోవడం, లీజుగడువు తీరిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూములను, ఆయా నిర్మాణాలకు అనుమతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంతా హెచ్​ఎండీఏ నిర్వహిస్తుంది.  వరల్డ్​క్లాస్​ఎమినిటీస్​తో, సరికొత్త కాన్సెప్టులతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయబోతున్నామని, స్టాండర్డ్​ అండ్​ కస్టమైజ్డ్​ టూరిస్టు ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.