
- సమ్మర్ హాలీడేస్ ముగుస్తుండడంతో పిల్లలతో కలిసి వస్తున్న ప్రజలు
- ఎండ తీవ్రత వల్ల పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే టైంపాస్
వరంగల్, వెలుగు: వరంగల్ నడిబొడ్డున ఉన్న జూపార్క్ ప్రజలకు కూల్ అండ్ పిక్నిక్ స్పాట్గా మారింది. రోహిణి కార్తె మొదలు కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చల్లదనం కోసం ప్రజలు జూ పార్క్కు క్యూ కడుతున్నారు. మరో వైపు సమ్మర్ హాలీడేస్ కూడా ముగుస్తుండంతో పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే సరదాగా గడుపుతున్నారు. మరికొందరైతే చెట్ల కిందే కార్పెట్లు వేసుకొని మధ్యాహ్నం ఓ కునుకు తీస్తున్నారు.
48 ఎకరాల్లో.. 417 రకాల జంతువులు
టూరిస్టులు, జంతు ప్రేమికులకు హైదరాబాద్లోని జూలాజికల్ పార్క్ తర్వాత వరంగల్లోని కాకతీయ జూపార్క్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులను ఇక్కడికి వస్తుంటారు. 1985లో 47.64 ఎకరాల్లో జూపార్క్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం 44 జాతులకు చెందిన 417 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. చిరుతపులులు, మనుబోతు, కొండ గొర్రెలు, ఆస్ట్రిచ్, కృష్ట జింకలతో పాటు మొసళ్లు, నక్షత్ర తాబేళ్లు, నెమళ్లు, హంసలు, లవ్ బర్డ్స్ ఉండడంతో వీటిని చూసేందుకు పెద్దలు, పిల్లలు తరలివస్తున్నారు.
మూడింతలు పెరిగిన రద్దీ
ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ కావడంతో జూపార్క్కు టూరిస్ట్ల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 250 నుంచి 300 మంది వస్తే సెలవు రోజుల్లో 1000 నుంచి 1200 మంది వస్తున్నారు. టికెట్ పెద్దలకు రూ. 40, చిన్నారులకు రూ. 20 ఖర్చు చేస్తే రోజంతా చల్లని ప్రదేశంలో ఉల్లాసంగా గడిపే అవకాశం ఉండడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరో వైపు ప్రీ వెడ్డింగ్ షూట్, పుట్టిన రోజు ఫొటో షూట్స్ కోసం కూడా
జూపార్క్ను ఎంచుకుంటున్నారు.