
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్సీయూలో ప్రధాని మోడీ ప్రారంభించిన 5 బిల్డింగులకు అనుమతులు లేవని.. మున్సిపల్, అటవీ, పర్యావరణ పర్మిషన్లు లేకుండానే లేకుండా భవనాలు నిర్మించారని అన్నారు. అలాగే.. మోడీ ఎన్నికల ర్యాలీల కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసిందని ఆరోపించారు.
ఐదేండ్లలో 1.09 లక్షల చెట్లు తొలగించామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. అంబానీ, అదానీల కోసం బీజేపీ వేల చెట్లను నరికేందన్నారు. చెట్లను నరకడం బీజేపీ సంస్కృతి అని.. చెట్లను నాటడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమన్నారు. ప్రధాని మోడీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. ఆయన గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also Read :- అడవులను నరకలే.. జంతువులను చంపలే
అంతకుముందు హర్యానాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందంటూ కంచ గచ్చిబౌలి భూములనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.