కేటీఆర్ పగటి కలలు కనొద్దు.. అరెస్టు కావడం పక్కా : మహేశ్ కుమార్

కేటీఆర్ పగటి కలలు కనొద్దు.. అరెస్టు కావడం పక్కా : మహేశ్ కుమార్

 

  • సన్నబియ్యంపై మాట్లాడే అర్హత మీకు లేదు
  • ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి 
  •  సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్
  • కేటీఆర్ అరెస్టు కావడం పక్కా: పీసీసీ చీఫ్

హైదరాబాద్:  తెలంగాణలో అధికారంలోకి  రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేక పోతోందని అన్నారు. సన్నబియ్యం పథకంపై మాట్లాడే అర్హత బీఆర్ ఎస్  నేతలకు లేదన్నారు.  ప్రజల ఆకాంక్షలు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతోందని చెప్పారు. ఉచిత బస్సు నుంచీ సన్న బియ్యం వరకు పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం  పంపిణీ చేపట్టిందని చెప్పారు.  సామాజిక న్యాయానికి చాంపియన్  రాహుల్ గాంధీ అని అన్నారు. 

ఎస్సీ వర్గీకరణ, కులగణన  సర్వే, బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. కాంగ్రెస్  పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదని చెప్పారు.  కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్టు కావాల్సిందేనని, ఆయనను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని అన్నారు.  సమావేశంలో పాల్గొన్నక ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  నాయకులు వినోద్ రెడ్డి, ఏనుగు రవీందర్,  కైలాష్ కుమార్, సిద్దేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.