
హైదరాబాద్: గచ్చిబౌలి భూవివాదంపై బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విమర్శించారు. హెచ్సీయూ భూముల వివాదంపై మంగళవారం (ఏప్రిల్ 1) గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ నుంచి ప్రభుత్వానికి భూబదలాయింపుపై ఒప్పందాలు క్లారిటీగా ఉన్నాయని పేర్కొన్నారు. 400 ఎకరాల భూమిపై 2004లో ప్రభుత్వం, హెచ్సీయూ మధ్య ఒప్పందం జరిగిందని.. వర్శిటీ, ప్రభుత్వం పరస్పర భూమార్పిడికి అంగీకరించాయని తెలిపారు.
గత వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలి భూముల కోసం పోరాడిందని చెప్పారు. హెచ్సీయూ భూముల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామాలు ఆడుతుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంతపాడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణమని, అటవీ జంతువులని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. లేని పోని హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల విషయంలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని.. అన్ని విషయాలు తెలిసి కూడా కావాలనే డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ALSO READ : జోకులు, సెటైర్లు..సీఎం, మంత్రుల సరదా ముచ్చట్లు
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు అడ్డగోలుగా భూముల దోచి పెట్టారని ఆరోపించారు. గోపన్ పల్లిలో ఆక్రమణకు గురైన భూముల వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని పేర్కొన్నారు. పదేళ్లలో కేటీఆర్ ఎన్నో భూములు కబ్జా చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. సెంట్రల్ వర్శిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన ఘనత ఇందిరా గాంధీది అని అన్నారు. హెచ్సీయూ దగ్గర్లోని భూములు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా.. ఇందుకు వ్యతిరేకంగా వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.