బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా: కేటీఆర్​కు మహేశ్ గౌడ్ సవాల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా: కేటీఆర్​కు మహేశ్ గౌడ్ సవాల్
  • బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపైనా చర్చకు రెడీ అని ప్రకటన  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం మాని, దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, దీనిపైనా చర్చకు సిద్ధమా? అని చాలెంజ్ చేశారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై అయినా చర్చకు తాము సిద్ధమేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ‘‘మీ నాయన, బావ, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం పరిధిలోనే మీ పార్టీకి ప్రజలు గుండు సున్నాతో బుద్ధి చెప్పిన విషయం మరిచావా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాడిద గుడ్డు వస్తదని తెలిసి.. మీ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించలేదు” అని అన్నారు. 

సీఎం రేవంత్, మంత్రుల బృందం బీఆర్ఎస్ పదేండ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్వికాసం వైపు నడిపిస్తున్నారని చెప్పారు. మూడు ముక్కలుగా చీలిన బీఆర్ఎస్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కనుమరుగవ్వడం ఖాయమని పేర్కొన్నారు.