రాహుల్​గాంధీని ప్రధాని చేసేవరకు విశ్రమించొద్దు :  టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​

రాహుల్​గాంధీని ప్రధాని చేసేవరకు విశ్రమించొద్దు :  టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​
  • కాంగ్రెస్​ పార్టీకి కార్యకర్తలే బలం
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కార్యకర్తల వల్లే
  • పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ 

కామారెడ్డి, భిక్కూరు, వెలుగు:  వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో రాహుల్​గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని, అంతవరకు కాంగ్రెస్​పార్టీ కార్యకర్తలు విశ్రమించొద్దని టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ పిలుపు ఇచ్చారు.   నిజామామాబాద్​ జిల్లాకు వెళ్తున్న ఆయనకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో హైవేపై జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా మహేశ్​కుమార్​గౌడ్​ మాట్లాడుతూ కార్యకర్తల బలంతోనే  రాష్ర్టంలో  కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  అధికారం వస్తుంది, పోతుంది  పార్టీ మాత్రమే శాశ్వతమన్నారు.  

రాష్ర్టంలో పార్టీ అధికారంలోకి రావటం సైమీఫైనల్​అని,  వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి రాహుల్​గాంధీ ప్రధానమంత్రి కావటం ఫైనల్​అన్నారు.    పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్నారు.  ఎన్ఎస్ యూ ఐలో  పని చేసిన తనను టీపీసీసీ ప్రెసిడెంట్​గా అధిష్టానం ఎంపిక చేసిందన్నారు.   త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నిలలో 90 శాతం సీట్లు  గెలవాలన్నారు.   కామారెడ్డి జిల్లా కాంగ్రెస్​ పార్టీకి కంచుకోట అన్నారు. మోడీ తన పాలనలో పెత్తందారులకే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు.

  సంపదనంతా ఆదాని, అంబానీలకే దోచి పెడుతున్నారని విమర్శించారు.  మంత్రి  పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ  గాంధీ కుటుంబం మాటమీద నిలబడే కుటుంబమన్నారు.  బీఆర్​ఎస్​ నేతలు ప్రభుత్వాన్ని  ఇబ్బందులకు గురిచేయాలని  చూస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం చేస్తున్న పనులను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ,  మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు,  కామారెడ్డి మున్సిపల్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ, లీడర్లు మద్ది చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, భీమ్​రెడ్డి,  పండ్ల రాజు, శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.  

ఇందల్వాయి, డిచ్​పల్లి మండలాల్లో..

ఇందల్వాయి, వెలుగు: పీసీసీ ప్రెసిడెంట్​గా తొలిసారి జిల్లాకు విచ్చేసిన మహేశ్​కుమార్​గౌడ్​కు శుక్రవారం ఇందల్వాయి, డిచ్​పల్లి మండలాల్లో కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. 
ఇందల్వాయి టోల్​ప్లాజా వద్దకు చేరుకున్న ఆయనకు నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పార్టీ లీడర్లు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ కార్యకర్తలవల్లే తమకు పదవులు వచ్చాయని, ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడమే తమ లక్ష్యమన్నారు.  

డిచ్​పల్లి వద్ద గజమాల తో పీసీసీ చీఫ్​ను స్థానిక లీడర్లు సన్మానించారు.  అనంతరం పార్టీ​ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి ర్యాలీగా తరలివెళ్లారు.